Andhra PradeshHome Page Slider

తీరంలో యువతి 12 గంటలు నరకయాతన

విశాఖ నగర శివారు అప్పికొండ సాగర తీరంలో ఓ యువతి రాళ్ల గుట్టల మధ్య చిక్కుకొని 12 గంటల పాటు నరకయాతన అనుభవించిన ఘటన సోమవారం జరిగింది.

  గాజువాక, కూర్మన్నపాలెం, పరవాడ, వన్‌టౌన్: విశాఖ నగర శివారు అప్పికొండ సాగర తీరంలో ఓ యువతి రాళ్ల గుట్టల మధ్య చిక్కుకొని 12 గంటల పాటు నరక యాతన అనుభవించిన ఘటన సోమవారం జరిగింది.

ఇందుకు సంబంధించి దువ్వాడ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన ఓ యువతి (18) మరో యువకుడితో కలిసి ఈ నెల 2వ తేదీ నుంచి అప్పికొండ శివాలయ పరిసరాల్లో ఉంటున్నారు.

   ఆదివారం సాయంత్రం తీరం వద్ద రాళ్ల గుట్టలపై ఆమె ఫొటో తీసుకుంటుండగా.. ఎత్తు ప్రవేశం నుంచి జారి కిందపడింది. అపస్మారక స్థితికి చేరుకున్న ఆమెను వదిలేసి యువకుడు పరారయ్యాడు. చిమ్మచీకటి, జన సంచారం లేని ప్రదేశంలో రాత్రంతా మృత్యువుతో పోరాడింది. సోమవారం ఉదయం బీచ్‌కు వచ్చిన కొందరు వ్యక్తులు యువతిని చూడగా.. అక్కడే ఉన్న గజ ఈతగాళ్ల సాయంతో ఒడ్డుకు తీసుకొచ్చారు. యువతి రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం 108 వాహనంలో కేడీహెచ్‌కు తరలించారు. కాలుజారి పడిపోయానని, పరారీలో ఉన్న యువకుడిని ఏం అనవద్దని ఆమె చెబుతోంది. అంబులెన్స్ సిబ్బంది యువతి తల్లికి సమాచారమివ్వగా.. తాము విశాఖ బయలుదేరి వస్తున్నట్లు పేర్కొన్నారు. కుమార్తె కనబడటం లేదని బందరు పోలీస్  స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు యువతి తల్లి తెలిపారు. కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు బందరు పీఎస్ నుంచి అంబులెన్స్ సిబ్బందికి సమాచారమిచ్చారు. దువ్వాడ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే పరారీలో ఉన్న యువకుడికి ప్రమాదం జరిగిందని, అతను కూడా కేజీహెచ్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నట్లు సమాచారం.