“స్కిల్ యూనివర్సిటీకి రూ.100 కోట్లు”.. రేవంత్ రెడ్డి
స్కిల్ యూనివర్సిటీ నిర్వహణకు ప్రభుత్వం తరపున రూ.100 కోట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. అలాగే యూనివర్సిటీ పూర్తిస్థాయి నిర్వహణకు కార్పస్ ఫండ్ ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు. ఎవరికి తోచిన విధంగా వారు వివిధ రూపాలలో యూనివర్సిటీ నిర్వహణకు సహకారం అందించవచ్చని పేర్కొన్నారు.
ఈ ఏడాది నుంచే స్కిల్ యూనివర్సిటీలో పలు కోర్సులను ప్రారంభిస్తున్నామని, పూర్తి వివరాలను పారిశ్రామికవేత్తలకు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా మంచి విజన్ ఉన్న నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి అంటూ ప్రశంసించారు ఆనంద్ మహీంద్రా. తెలంగాణ నుంచి నైపుణ్యం కలిగిన యువతను ప్రపంచానికి అందించాలన్న ముఖ్యమంత్రి ఆలోచన చాలా గొప్పదని కొనియాడారు. అందుకే యూనివర్సిటీ బోర్డు చైర్మన్ గా ఉండాలని ఆయన కోరగానే ఒప్పుకున్నానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో హాజరయ్యారు ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క. ఇంకా మంత్రి శ్రీధర్ బాబు, యూనివర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్రా, కో చైర్మన్ శ్రీనిరాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు.