జోడో యాత్రలో రాహుల్ గాంధీకి మ్యారేజ్ ప్రపోజల్
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. యాత్ర కన్యాకుమారి జిల్లా మార్తాండం ప్రాంతంలో భోజన విరామం సమయంలో ఉపాధి హామీ మహిళా కూలీలతో రాహుల్ గాంధీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కుటుంబ స్థితిగతులు, వారి సంపాదన, తీసుకురావాల్సిన మార్పు తదితర అంశాలపై ముచ్చటించారు. ఈ సందర్భంగా మాటల మధ్యలో ఓ మహిళ మాట్లాడూతూ రాహుల్ పెళ్లి ప్రస్తావనను తీసుకొచ్చింది.

”మీరు తమిళనాడును ప్రేమిస్తారని మాకు తెలుసు. తమిళ యువతితో మీకు వివాహం చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం” అని ఓ మహిళ రాహుల్ గాంధీతో అన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ట్విటర్లో వెల్లడించారు.
వారితో మాట్లాడుతున్న సమయంలో రాహుల్ చాలా ఉత్సాహంగా కనిపించినట్లు ఆయన చెప్పారు. ఆ సన్నివేశానికి అద్దంపట్టే రెండు ఫొటోలను తన ట్వీట్కు జత చేశారు.
నిన్న సాయంత్రం యాత్ర కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించింది. సరిహద్దులో ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు రాహుల్గాంధీకి ఘనస్వాగతం పలికారు. కేరళలో 18 రోజుల పాటు జోడో యాత్ర ఉంటుందని నేతలు తెలిపారు.