స్పీకర్ నిర్ణయం తప్పు
ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై తీవ్రస్థాయిలో జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ‘జనం బాట’ కార్యక్రమం గురువారం నిర్వహించారు . ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ , బీఆర్ఎస్ నుండి గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకుండా, సాక్ష్యాధారాలు లేవని చెప్పడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని విమర్శించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు. కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఆమె, అక్కడ మౌలిక సదుపాయాల కొరతను ఎత్తిచూపుతూ కార్డియాలజీ, నెఫ్రాలజీ విభాగాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం కార్మికులకు ద్రోహం చేయడమేనని, బొగ్గు బ్లాకుల వేలాన్ని ఆపి స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. మహిళలకు నెలకు రూ.2,500 మరియు రైతుబంధు నిధులను వెంటనే విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

