InternationalNews

నిన్న రోహిత్‌… నేడు విరాట్‌…

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్‌ టోర్నీలో భారత జట్టు అద్భుతంగా ఆడుతూ జోరు మీదుంది. గత రెండు రోజుల నుండి టీమిండియా ప్లేయర్లు నెట్‌ ప్రాక్టీస్‌ సెషన్‌ గాయాలతో సతమతమవుతున్నారు. నిన్న కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్వల్ప గాయానికి గురయ్యాడు. బౌలర్‌ రఘు వేసిన బంతి రోహిత్‌ కుడి చేయికి గట్టిగా తగిలింది. దాంతో రోహిత్‌ నొప్పితో విలవిల లాడిపోయాడు. అయితే.. 40 నిమిషాల తర్వాత తను మళ్లీ ప్రాక్టీస్‌ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

సూపర్‌ ఫామ్‌లో ఉన్న టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లీ నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్నప్పుడు గాయపడ్డాడు. హర్షల్‌ పటేల్‌ వేసిన బంతి గజ్జల్లో తగలడంతో కోహ్లీ ఇబ్బంది పడ్డాడు. నొప్పి ఎక్కువ కావడంతో నెట్స్‌ నుంచి వెళ్లిపోయాడు. కోహ్లీకి అయిన గాయంపై అటు టీమిండియా, ఇటు ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారు. కోహ్లీ గాయపడిన వార్త అందరినీ ఉలిక్కిపడేలా చేస్తోంది. ఈ టోర్నీలో కోహ్లీ అద్భుతంగా రాణిస్తున్నాడు. టీమిండియా టాప్‌ స్కోరర్‌గా ఉన్నాడు. ఇంగ్లండ్‌తో రేపు జరిగే సెమీఫైనల్లో తను ఆడుతాడో లేదో వేచి చూడాల్సిందే.