కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని గుజరాత్లో జరిగిన నకిలీ ఎన్కౌంటర్ కేసులో దర్యాప్తు సంస్థ విచారిస్తున్న సమయంలో సీబీఐ తనపై ఒత్తిడి తెచ్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘న్యూస్ 18 రైజింగ్ ఇండియా’ కార్యక్రమంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్ర ఏజెన్సీలను ‘దుర్వినియోగం’ చేస్తోందన్న ప్రతిపక్షాల ఆరోపణపై ఒక ప్రశ్నకు సమాధానంగా షా ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బూటకపు ఎన్కౌంటర్ కేసులో మోదీని… గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఇరికించాలని సీబీఐ నాపై ఒత్తిడి తీసుకువచ్చిందని… ఇంత జరిగినా బీజేపీ ఏనాడూ రాద్ధాంతం చేయలేదన్నారు. పరువు నష్టం కేసులో గాంధీని సూరత్లోని కోర్టు దోషిగా నిర్ధారించడం, కోర్టు దోషిగా నిర్ధారించి శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయిన రాజకీయ నాయకుడు కాంగ్రెస్ నాయకుడు ఒక్కడు మాత్రమే కాదని హోం మంత్రి అన్నారు.

రాహుల్ గాంధీ పైకోర్టుకు వెళ్లే బదులు, ప్రధాని నరేంద్ర మోదీపై నిందలు మోపేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.రాహుల్, మోదీపై నిందలు మోపేందుకు ప్రయత్నించే బదులు రాహుల్ గాంధీ తన కేసుపై పోరాడేందుకు ఉన్నత న్యాయస్థానానికి వెళ్లాలని షా సూచించారు. అప్పుడు కోర్టు శిక్షపై స్టే సైతం విధించవచ్చన్నారు అమిత్ షా. నేరారోపణపై స్టే తీసుకోవాలని అప్పీల్ చేయడంలేదన్నారు. ఇది దురహంకారమని మండిపడ్డారు. ఫేవర్ కావాలి. ఎంపీగా కొనసాగాలనుకుంటున్నారు.. కానీ కోర్టుకు మాత్రం వెళ్లరా అంటూ దుయ్యబట్టారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో 2013లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల కారణంగా లాలూ ప్రసాద్, జయలలిత, రషీద్ అల్వీ సహా 17 మంది ప్రముఖ నాయకులు సభ్యత్వాలను కోల్పోయారని, ఒక ఎన్నికైన ప్రతినిధి దోషిగా తేలిన వెంటనే తన స్థానాన్ని కోల్పోతారని షా చెప్పారు. అయినప్పటికీ, ఎవరూ నల్ల బట్టలు ధరించి నిరసన వ్యక్తం చేయలేదని, ఎందుకంటే ఇది ఈ భూమిపై తయారు చేసిన చట్టమని షా అన్నారు. రాహుల్ గాంధీ పూర్తి ప్రసంగంలో… మోదీని దూషించే మాటలు మాట్లాడలేదని… అతను మొత్తం మోదీ వర్గాన్ని, ఓబీసీ OBC సమాజాన్ని దూషించే మాటలు మాట్లాడాడన్నారు. దేశంలో చట్టం స్పష్టంగా ఉందని… బీజేపీకి ప్రతీకార రాజకీయాల ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. ఇది కేవలం ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు మాత్రమేనని ఆయన చెప్పుకొచ్చారు.

బంగ్లాను ఖాళీ చేయమని నోటీసు గురించి అడిగిన ప్రశ్నకు, శిక్ష అమలులోకి వచ్చిన వెంటనే చర్య తీసుకోవాలని సుప్రీం కోర్టు చెప్పినప్పుడు… ఒకరి విషయంలోనే… ప్రత్యేక ఫేవర్ చేయాలా అని అమిత్ షా ప్రశ్నించారు. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పకూడదనుకుంటే, బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు షా. తాజాగా అనర్హత పడిన రాహుల్ మాత్రం మొదటివాడు కాడని… చాలా పెద్ద పదవులు అనుభవించిన రాజకీయ నాయకులు ఈ నిబంధన కారణంగా సభ్యత్వాలను కోల్పోయారన్నారు హోం మంత్రి. లాలూని అనర్హుడిగా ప్రకటించినప్పుడు భారత ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లలేదని, గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తిని అనర్హుడిగా ప్రకటించినప్పుడే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందా అంటూ ఆయన మండిపడ్డారు. వ్యవహారం తన వరకు వచ్చింది కాబట్టే… గాంధీ కుటుంబానికి ప్రత్యేక చట్టం చేయాలని అంటున్నారని… ఒక్క కుటుంబానికి ప్రత్యేక చట్టం ఉండాలా అని ఈ దేశ ప్రజలను అడగాలనుకుంటున్నానన్నారు అమిత్ షా. ఇది ఎలాంటి మనస్తత్వమని ఆయన దుయ్యబట్టారు. మోదీని, లోక్సభ స్పీకర్ను నిందించడం మంచిపద్ధతేనా అని షా అన్నారు.

రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలుగా ఉన్న సీనియర్ న్యాయవాదులు అనర్హత వేటు విషయంలో… లోక్సభ స్పీకర్ పాత్ర లేదని సహచర పార్టీ నేతలకు చెప్పాలని షా అన్నారు. దోషిగా తేలిన క్షణం నుంచి పార్లమెంట్లో ఆయన చేసిన ప్రసంగాలన్నింటినీ రికార్డుల నుంచి తుడిచివేయాలన్నది చట్టం చెబుతోందని… కొద్దిరోజుల తర్వాత అనర్హత నోటీసును అందించినా పెద్దగా తేడా ఏమీ ఉండదన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల్లో మార్పులను బీజేపీ కోరుకోవడం లేదని షా అన్నారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వును పక్కనబెట్టడానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చింది… కానీ రాహుల్ గాంధీ ఆ ఆర్డినెన్సు కు అర్ధంలేనిదని మండిపడ్డారన్నారు. ఆ ఆర్డినెన్స్ను ఒకసారి రాహుల్ చించివేస్తే… దానిని చట్టంగా మార్చడానికి ఎవరూ సాహసించలేదన్నారు. ఆ ఆర్డినెన్స్ చట్టంగా మారినట్లయితే, ఇవాళ రాహుల్ గాంధీ రక్షించబడేవాడన్నారు షా.

సావర్కర్పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య గురించి ప్రశ్నించగా, అండమాన్ జైలులో రెండు జీవితకాల శిక్షలు అనుభవించిన ఏకైక స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ సావర్కర్ అని హోంమంత్రి అన్నారు. ఇలాంటి స్వాతంత్య్ర సమరయోధుడికి ఇలాంటి భాష ప్రయోగించి ఉండాల్సింది కాదన్నారు. వీర్ సావర్కర్పై తన నానమ్మ ఇందిరా గాంధీ ప్రసంగాన్ని రాహుల్ చదవాలన్నారు అమిత్ షా. సావర్కర్కు వ్యతిరేకంగా మాట్లాడవద్దని సొంత పార్టీ వారే రాహుల్ గాంధీకి సలహా ఇస్తున్నారని అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ మళ్లీ భారీ మెజారిటీతో ప్రధాని అవుతారని.. 2019 ఎన్నికల కంటే 2024 ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని షా అన్నారు. విపక్షాల మధ్య ఐక్యత లేదని చెప్పుకొచ్చారు.

రాబోయే కర్నాటక ఎన్నికలలో, బీజేపీ సగానికి పైగా సీట్లను సాధిస్తుందని… రాష్ట్రంలో స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని షా అన్నారు. కర్నాటకలో ఎలాంటి పొత్తు ఉండదని షా అన్నారు, బీజేపీ కచ్చితంగా సగం మార్కును దాటుతుందని… కర్ణాటకలో సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందన్నారు. రికార్డు స్థాయిలో విజయం సాధిస్తామన్నారు. మత ప్రాతిపదికన కోటాను రద్దు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ, మతం ఆధారంగా రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని అన్నారు అమిత్ షా. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం, మత ప్రాతిపదికన చేసిందన్నారు. ఇప్పుడు దానిని బీజేపీ సరిదిద్దిందన్నారు.
ప్రతిపక్ష నేతలపై దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణలను హోంమంత్రి తోసిపుచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మేము ఎప్పుడూ ప్రతిపక్షాలను నిందించలేదని, అమాయక పోలీసు అధికారులను కటకటాల వెనక్కి నెట్టారని షా అన్నారు.

అవినీతికి వ్యతిరేకంగా 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందని షా అన్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 1.10 లక్షల కోట్ల ఆస్తులను జప్తు చేసిందని, ఇందులో రాజకీయ నేతలది ఐదు శాతం కూడా లేదన్నారు. అవినీతిపై పోరాటాన్ని ఆపేద్దామా? నిందితుడు రాజకీయ నాయకుడు అయితే చర్యలు తీసుకోకూడదా అని షా ప్రశ్నించారు. లాలూ ప్రసాద్ యాదవ్పై ఎవరు కేసులు పెట్టారని, షేక్ అబ్దుల్లాను అరెస్టు చేసేందుకు ఢిల్లీ నుంచి అధికారులతో కూడిన విమానాన్ని ఎవరు పంపించారని హోంమంత్రి ప్రశ్నించారు. కేంద్ర ఏజెన్సీలు దుర్వినియోగం గురించి చరిత్ర ఒకసారి తెలుసుకోవాలన్నారు అమిత్ షా. 19 నెలల ఎమర్జెన్సీ సమయంలో వేలాది మంది అమాయకులను జైలులో పెట్టారని, ఆ రోజు ఆ పని ఎవరు చేశారని షా ప్రశ్నించారు. ఆ ఘటనకు కారణం రాహుల్ గాంధీ నానమ్మ ఇందిరా గాంధీ అని తెలియదా అని దెప్పిపొడిచారు.

మహారాష్ట్ర ప్రశ్నపై, ప్రజలు శివసేన, బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకున్నారని, ఇప్పుడు నిజమైన శివసేనతో బీజేపీ ఉందన్నారు. మహారాష్ట్రలో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని నేను కూడా అంగీకరిస్తున్నానన్నారు. బీజేపీలో శివసేన విలీనం ప్రశ్నే లేదన్నారు. అవినీతికి పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు అమిత్ షా. రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో కాంగ్రెస్ ప్రభుత్వాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందన్నారు. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా విజయం సాధిస్తాందన్నారు. రాజస్థాన్ నాయకత్వంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్న షా… రాజస్థాన్ సీఎంను మార్చాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.

ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రతి మూడు నెలలకోసారి పంజాబ్ ముఖ్యమంత్రిని కలుస్తానన్న షా… దేశ భద్రత విషయంలో ఆప్ సర్కారుకు అండగా ఉంటానని అమృతపాల్ సింగ్ విషయం గురించి అమిత్ షా వివరించారు. అమృతపాల్ కేసుకు సంబంధించి పలువురిని అరెస్టు చేశామని, పోలీసులు, నిఘా వర్గాలు ఈ కేసుపై కసరత్తు చేస్తున్నారన్నారు. విదేశాల్లోని భారతీయ మిషన్లపై దాడులపై షా మాట్లాడుతూ, ఇది భారత్పై దాడి అని అన్నారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే ఢిల్లీలో ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు. భారతదేశ స్వాతంత్య్రానికి సిక్కుల సహకారం అపారమైనది.. ప్రతి సిక్కు భారత్తో ఉండాలని కోరుకుంటాడన్నారు.

న్యాయవ్యవస్థ, ప్రభుత్వానికి మధ్య ఎలాంటి ఘర్షణలు లేవన్నారు హోంమంత్రి. న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ రెండూ తమ తమ పరిధిల్లో పనిచేస్తున్నాయని… ఆయన అన్నారు. చట్టాలు చేయడమే ప్రభుత్వ బాధ్యతని… పార్లమెంటు మొత్తం వ్యవహారం గురించి ఆలోచిస్తుందని చెప్పారు.