ఇక నుంచి ఊరుకోనేది లేదు.. నటి స్ట్రాంగ్ వార్నింగ్
సినీ నటి సాయిపల్లవి నటిస్తున్న బాలీవుడ్ మూవీ ‘రామాయణ’లో సీత పాత్ర చేసేందుకు వెజిటీరియన్ గా మారిపోయారని ఓ తమిళ వెబ్సైట్ కథనాలు ప్రచురించింది. ఈ నేపథ్యంలోనే ఆమె తీవ్రంగా స్పందించారు. నిరాధారమైన పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు ఎదుర్కొవాల్సి ఉంటుందని ఆమె స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తన మౌనాన్ని అవకాశంగా తీసుకోవద్దని ‘ఎక్స్’ వేదికగా సాయిపల్లవి హెచ్చరించారు.
“చాలా సార్లు, దాదాపు ప్రతిసారీ నేను నిరాధారమైన పుకార్లు/ కల్పిత అబద్ధాలు/ తప్పుడు ప్రకటనలు వ్యాప్తి చెందడాన్ని చూసినప్పుడల్లా మౌనంగా ఉండటాన్ని ప్రయత్నిస్తుంటాను. అలాంటి వాటికి స్పందించడం అనవసరం అనేది నా భావన. కానీ ఇది ఆగడం లేదు. స్థిరంగా అలాగే కొనసాగుతున్నందున నేను ప్రతిస్పందించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇకపై నా సినిమాల విడుదలలు, ప్రకటనలు, నా కెరీర్లో సంతోషించ దగిన క్షణాల సమయంలో గాసిప్ ల పేరుతో చెత్త కథనాన్ని ప్రచురించడం చేస్తే.. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయి” అని సాయిపల్లవి ట్వీట్ చేశారు. దీంతో ఇప్పుడీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.