మల్లికార్జున ఖర్గేతో కోమటిరెడ్డి భేటీ
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. ఏఐసీసీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనందున ఖర్గేకు వెంకట్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణ రాజకీయ పరిస్థితులు, నేతలు పార్టీ వీడటంపై చర్చించినట్లు తెలుస్తోంది. మర్రి శశిధర్రెడ్డి, వెంకట్ రాంరెడ్డి సహా పలువురు సీనియర్ నాయకులు పార్టీకి రాజీనామా చేయడంపై ఖర్గేకు వివరించినట్లు సమాచారం. సుమారు అరగంట పాటు ఖర్గేతో సమావేశమైన వెంకట్రెడ్డి పీసీసీ కమిటీల వ్యవహారంపై చర్చించినట్లు తెలుస్తోంది.
అయితే… ఈనెల 10వ తేదీన ఏఐసీసీ టీపీసీసీ కమిటీలను ప్రకటించింది. ఈ కమిటిల్లో వెంకట్ రెడ్డికి చోటు కల్పించలేదు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో పార్టీ అభ్యర్థికి కాకుండా తన సోదరుడికి ఓటు చేయాలని వెంకట్ రెడ్డి కోరినట్టుగా ఆడియో బయటకు వచ్చింది. మరోవైపు ఆస్ట్రేలియా పర్యటనలో కూడా కాంగ్రెస్ పార్టీపై వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని చెప్పారు. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయింది. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ వెంకట్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు వెంకట్రెడ్డి సమాధానం ఇచ్చారు. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.