జగన్ పాలనలో అన్నివర్గాల ప్రజలకు కష్టాలే!
కడప: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్నివర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సతీమణి నారా భువనేశ్వరి విమర్శించారు. త్వరలోనే ప్రజల సమస్యలన్నీ తొలగిపోతాయని, అందరూ ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. బద్వేలు నుంచి శుక్రవారం ఉదయం నిజం గెలవాలి యాత్రను ప్రారంభించిన ఆమె చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్తాపానికి గురై మృతిచెందిన వారి కుటుంబాలను పరామర్శించారు. బి.కోడూరు మండలం గుంటపల్లిలో తెదేపా కార్యకర్త ఓబుల్రెడ్డి, కలసపాడు మండలం లింగా రెడ్డిపల్లిలో సగిలిడేవిడ్, బ్రాహ్మణపల్లిలో నల్లగుండ్ల వెంకటయ్య, తెల్లవాడులో బసిరెడ్డి చెంచురెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించారు. మృతుల చిత్రపటాలకు నివాళులర్పించిన అనంతరం కుటుంబసభ్యులతో మాట్లాడి ఓదార్చారు. అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో మూడు రోజుల పర్యటనను ముగించుకుని తిరుపతి జిల్లా గూడూరుకు బయలుదేరి వెళ్లారు. ఆమె వెంట కొంతమంది ప్రముఖులు, తదితరులున్నారు.