InternationalNews

బంగ్లాపై భారత్‌ ఉత్కంఠ విజయం.. సెమీస్‌లో అడుగు

ట్వంటీ20 ప్రపంచకప్‌లో మరో రసవత్తర మ్యాచ్‌ నమోదైంది. అడిలైడ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో భారత్‌ చివరి బంతికి విజయాన్ని చుంభించింది. దీంతో గ్రూప్‌-2లో అగ్ర స్థానానికి ఎగబాకి సెమీఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప భారత్‌ సెమీస్‌కు చేరుకోవడం ఖాయం. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. 185 పరుగుల లక్ష్యంతో దూకుడుగా బ్యాటింగ్‌ ప్రారంభించిన బంగ్లాదేశ్‌ 7 ఓవర్లలోనే వికెట్‌ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. ఈ దశలో మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 16 ఓవర్లకు కుదించి బంగ్లాదేశ్‌ లక్ష్యాన్ని 151 పరుగులకు సవరించారు. అయితే.. బంగ్లాదేశ్‌ 16 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 146 పరుగులు మాత్రమే సాధించగలిగింది. భారత్‌ 5 పరుగులతో జయకేతనం ఎగురవేసింది. క్రికెట్‌ కింగ్‌ విరాట్‌ కోహ్లీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. కోహ్లీ 44 బంతుల్లో 64 పరుగులు (8 ఫోర్లు, ఒక సిక్సర్‌) చేసి నాటౌట్‌గా నిలవడం విశేషం. కేఎల్‌ రాహుల్‌ కూడా 32 బంతుల్లో 50 పరుగులు (3 ఫోర్లు 4 సిక్సర్లు) సాధించాడు.