NewsTelangana

మునుగోడు తొలి పోలింగ్ కేంద్రం జైకేసారం

మునుగోడు, మనసర్కార్

మునుగోడు ఉప ఎన్నికలు నవంబరు 3న నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు ముమ్మరం చేశారు. పోలింగ్‌ నిర్వహించేందుకు నియోజకవర్గంలో 298 పోలింగ్‌ కేంద్రాలు సిద్ధం చేశారు. ఇటీవల కేంద్ర ఎన్నికల పరిశీలకుడు పంకజ్‌కుమార్‌ పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచనలిచ్చారు. మునుగోడు నియోజకవర్గం 7 మండలాల్లోని 159 గ్రామ పంచాయతీలు, 2 పురపాలికలతో విస్తరించి ఉంది. చౌటుప్పల్‌ మండలం జైకేసారం నుంచి ఈ నియోజకవర్గం ప్రారంభమవుతుంది. ఆ గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలోని పదో తరగతి గదిలో ఒకటో నెంబరు పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ కేంద్రంలో మొత్తం 896 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

మొత్తం 298 కేంద్రాలు
మునుగోడులో 44, చౌటుప్పల్‌లో 44, చౌటుప్పల్‌ పురపాలిక పరిధిలో 24, నారాయణపురంలో 54, నాంపల్లిలో 43, చండూరులో 29, చండూరు పురపాలిక పరిధిలో 11, మర్రిగూడలో 33, గట్టుప్పలలో 16 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. ఈ పోలింగ్‌ కేంద్రాల ప్రకారమే బ్యాలెట్‌ పెట్టెల కేటాయింపు, ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.