గులియన్ బారే సిండ్రోమ్ కేసు నమోదు
హైద్రాబాద్ నగరంలో గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) కేసు నమోదైంది. సిద్దిపేట మండలానికి చెందిన మహిళకు జీబీఎస్ ఉన్నట్లు వైద్యులు నిర్ధరించారు. బాధితురాలు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతోంది. ఇప్పటికే మహారాష్ట్రలో వంద వరకు ఈ కేసులు నమోదైన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో గులియన్ బారే సిండ్రోమ్ కేసులు నమోదవడం ఆందోళనకు గురిచేస్తోంది. బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా బలహీన రోగనిరోధక శక్తి కలిగిఉన్న వ్యక్తులు ఈ జీబీఎస్ బారినపడే అవకాశాలు ఉంటాయని వైద్యులు వెల్లడించారు. శరీరానికి సోకిన ఇన్ఫెక్షన్కు ప్రతిస్పందించే రోగ నిరోధక వ్యవస్థ పొరపాటున నరాలపై దాడి చేసే అరుదైన పరిస్థితి ఇది.ఆ రుగ్మత బారినపడిన వారికి ఒళ్లంతా తిమ్మిరిగా అనిపించడం, కండరాలు బలహీనంగా మారడం, డయేరియా, పొత్తికడుపు నొప్పి, జ్వరం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కలుషిత ఆహారం, నీటి ద్వారా ఆ బ్యాక్టీరియా సోకుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే, ప్రజలు భయాందోళనకు గురికావొద్దని, జీబీఎస్ అంటువ్యాధి కాదని, చికిత్సతో నయం చేయొచ్చని వైద్యులు వెల్లడించారు.

