రైతు భరోసా కాదు….ఆరని గుండె కోత
సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నట్లు అది రైతు భరోసా పథకం కాదని..అన్నదాతలు ఆరుగాలం శ్రమించి పంటలను ధాన్యంగా మారిస్తే వాటిని బూడిద పాలు చేయడానికి వచ్చిన అగ్ని క్రతువని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎకరంలోపు ఉన్న రైతుల సంఖ్య 22,55,181గా గుర్తించి రైతు బంధు అందించామని గుర్తు చేశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టు అంటూ, ఎకరం ఉన్న రైతులకు అంటూ ఇప్పటి వరకు 21,45,330 రైతులకే రైతు భరోసా కల్పించడం వివక్షాపూరితమన్నారు. 1,09,851 మంది రైతులకు కోత విధించి రైతు భరోసా ఎగ్గొట్టిందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు భరోసాపై కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది గోరంత, చెప్పకునేది కొండంత అని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో రైతుకు ఎకరానికి 17,500 చొప్పున బాకీ పడిందని.. ఈ బాకీని, కోత పెట్టిన 1,09,851 మంది రైతులకు వెంటనే రైతు భరోసా వేయాలని బీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని హరీష్ రావు చెప్పారు.

