పోక్సో కేసులో శిక్షను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ఇంటర్నెట్ డెస్క్ : మైనర్ బాలికపై లైంగిక దాడి చేసిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదయ్యింది. ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్న నిందితుడి 10 ఏళ్ల శిక్షను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. సంపూర్ణ న్యాయం అందించే లక్ష్యంతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద తనకు సంక్రమించిన ప్రత్యేక అధికారాలను ఉపయోగించి, పోక్సో చట్టం కింద దోషిగా తేలిన వ్యక్తికి విధించిన శిక్షను రద్దు చేసింది. ఎందుకంటే ఈ కేసులో నిందితుడైన వ్యక్తి బాధితురాలిని వివాహం చేసుకోవడం వలన, ఆమె అభ్యర్థన మేరకు ఈ కేసులోని విలక్షణమైన వాస్తవాలు, ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఓ వ్యక్తికి ట్రయల్ కోర్టు శిక్ష విధించింది. పోక్సో చట్టంలోని సెక్షన్ 6 కింద పదేళ్ల కఠిన కారాగార శిక్ష, ఐపీసీ సెక్షన్ 366 కింద ఐదేళ్ల జైలు శిక్ష పడింది. ఈ తీర్పును సవాలు చేస్తూ నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ అప్పీల్ విచారణలో ఉండగానే కేసు అనూహ్య మలుపు తిరిగింది. నిందితుడు, బాధితురాలు మేజర్ అయిన తర్వాత మే 2021లో వివాహం చేసుకున్నారు. వారికి ప్రస్తుతం ఏడాది వయసున్న కుమారుడు కూడా ఉన్నాడు. తాను తన భర్తతో సంతోషకరమైన, ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నట్లు బాధితురాలు అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఈ అసాధారణ పరిస్థితులను పరిశీలించిన జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ లతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. “నేరం అనేది కేవలం వ్యక్తికి వ్యతిరేకంగా జరిగింది కాదు, సమాజానికి వ్యతిరేకంగా జరిగింది. కానీ, వాస్తవ పరిస్థితులను విస్మరించలేం” అని పేర్కొంది. ఈ కేసులో నేరం కామంతో జరిగింది కాదు, ప్రేమతో జరిగింది. ఇప్పుడు నిందితుడిని జైలులో ఉంచితే, వారి కుటుంబం విచ్ఛిన్నమవుతుంది. బాధితురాలికి, పసిబిడ్డకు, చివరకు సమాజానికి కూడా తీరని నష్టం జరుగుతుంది. న్యాయం కోసం కొన్నిసార్లు చట్టం కూడా తలవంచాల్సి ఉంటుంది” అని ధర్మాసనం అభిప్రాయపడింది.
అయితే, ఈ తీర్పుతో పాటు నిందితుడికి సుప్రీంకోర్టు తన భార్యాబిడ్డలను జీవితాంతం గౌరవంగా పోషించాలి. వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలివేయకూడదు. అలా చేస్తే తీవ్ర పరిణామాలుంటాయి అంటూ షరతు విధించింది. అయితే ఈ కేసులోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా మాత్రమే ఈ తీర్పు ఇస్తున్నామని, ఇది ఇతర కేసులకు వర్తించదని స్పష్టం చేసింది.

