InternationalNews

ఫైనల్‌లోకి దూసుకెళ్లిన పాక్‌

టీ 20 వరల్డ్‌ కప్‌లో పాక్‌ టీం ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ జట్టుపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్‌.. 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విక్టరీ  సాధించింది. మరో 5 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని సొంతం చేసుకుంది. కెప్టెన్‌ బాబార్‌ ఆజమ్‌ (42 బంతుల్లో 53), రిజ్వాన్‌ (43 బంతుల్లో 57) హాఫ్‌ సెంచరీలతో రాణించారు.

న్యూజిలాండ్‌ పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించలేకపోయింది. తొలి ఓవర్‌లోనే న్యూజిలాండ్‌ ఓపెనర్‌ ఫిన్‌ అలెన్‌ (4)ను షహీన్‌ ఆఫ్రీదీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కెప్టెన్‌ కేన్‌ విలయమ్సన్‌ (46) పరుగులు చేశాడు. గ్లెన్‌ ఫిలిప్స్‌ (6) వెంటనే ఔటయ్యాడు. కెప్టెన్‌ తో కలిసి డారిల్‌ మిచెల్‌ (53) పరుగులతో న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించాడు. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి న్యూజిలాండ్‌ 152 పరుగులు చేసి పాకిస్తాన్‌కు 153 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

పాకిస్తాన్‌ ఫైనల్‌కు రావడంతో మరోసారి భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఫైనల్‌ జరగాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. రేపు ఇంగ్లాండ్‌పై గెలిస్తే టీమిండియా ఫైనల్‌కు చేరుకుంటుంది. 2007 టీ20 వరల్డ్‌ కప్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌ రిపీట్‌ అయ్యే అవకాశం కనిపిస్తోంది.