NationalNews Alert

రజనీకాంత్ కు గవర్నర్ పదవి…?

బీజేపీ ఉత్తరాదిలో చాలా వరకు రాష్ట్రాలను కైవసం చేసుకుంది. దక్షిణాదిలో కూడా పాగా వేయాలని ఎప్పటి నుంచో చూస్తోంది. కానీ కర్ణాటక మినహా మరే రాష్ట్రంలోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో ఆ పార్టీ సత్తా చాట లేకపోతోంది. ఇప్పటికే తెలంగాణలో క్రమక్రమంగా ఎదుగుతూ టీఆర్ఎస్‌కు చెక్ పెట్టేందుకు స్కేచ్ మొదలుపెట్టిన బీజేపీ మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా పాగా వేయాలనే గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగానే బీజేపీ ఇప్పుడు తమిళనాడులో సైతం కమలాన్ని వికసింపజేయాలని ప్రయత్నాలు చేస్తుంది.. ఈ నేపథ్యంలోనే సంగీత దర్శకుడు ఇళయరాజాకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి మరీ పెద్దల సభకు పంపించింది. ఇప్పుడు బీజేపీ మరో కీలక నిర్ణయం తీసుకుందనే ప్రచారం జరుగుతోంది. తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కి గవర్నర్ పదవి అప్పగించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. దానికి ముఖ్య కారణం ఈ మధ్య ఢిల్లీలో జరిగిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలలో రజనీకాంత్ కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు హాజరై పాల్గొన్నారు. ఈ సమయంలోనే ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితరులతో భేటి అయ్యారు. అక్కడి నుంచి వచ్చిన మరునాడే తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తో భేటీ అవ్వడం చర్చనీయాంశం అయింది. తమిళనాడు గవర్నర్ తో రాజకీయాలపై చర్చించానంటూ బహిరంగ ప్రకటన చేయడంతో ఈ విషయం హట్ టాపిక్‌గా మారింది.

అయితే రాజకీయ పార్టీ పెట్టి తాను నడపలేనని తన వల్ల కాదని విరమించుకున్న రజినీకాంత్ ఇలా ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడటం ఏమిటా అని అందరూ భావించారు. అసలు విషయం ఏమిటంటే 2024 లోక్ సభ ఎన్నికలలో తమిళనాడు నుంచి వీలైనన్నీ ఎక్కువ సీట్లు సాధించడమే ముఖ్య లక్ష్యంగా రంగంలోకి దిగిన బీజేపీ రజినీకాంత్ కి గవర్నర్ పదవి కట్ట పెట్టాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి ప్రధానమంత్రి మోడీ రజినీకాంత్ మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. గతంలో మోడీ చెన్నై వచ్చినప్పుడు కూడా రజనీకాంత్ ఇంటికి వెళ్లి చాలా సేపు ఆ కుటుంబంతో సరదాగా గడిపారు. ఆ సాన్నిహిత్యం వల్ల ప్రధాని మోదీ కోరడంతో రజనీకాంత్ కాదనలేక గవర్నర్ పదవి తీసుకోవడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. రజినీకాంత్ ను ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ గా పంపితే ఆయన అభిమానులంతా బీజేపీ వెంట ఉంటారని తద్వారా లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ బలపడుతుందని కాషాయదళం భావిస్తోంది