ఇజ్రాయెల్లో తమ ఉద్యోగుల కోసం గూగుల్, మైక్రోసాఫ్ట్ ఆందోళన
ఇజ్రాయెల్-పాలస్తీనా దేశాల మధ్య యుద్ధంలో తమ ఉద్యోగుల పరిస్థితి ఏంటని టెక్ కంపెనీలు ఆందోళనలు చెందుతున్నాయి. ఈ మేరకు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ట్వీట్లు చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు తీవ్ర సానుభూతి తెలుపుతున్నానని, హమాస్ మిలిటెంట్ల దాడి తనను తీవ్రంగా కలచి వేసిందని సత్యనాదెళ్ల ట్వీట్ చేశారు. ఇజ్రాయెల్లో పని చేస్తున్న తమ ఉద్యోగులు, కుటుంబసభ్యులకు అవసరమైన సాయం అందించడానికి తమ కంపెనీ సిద్ధంగా ఉందని తెలియజేశారు. ప్రస్తుతం ఇజ్రాయెల్లో మూడువేల మంది మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు ఉన్నారని, పాలస్తీనాకు చెందిన వారు కూడా ఉన్నారని పేర్కొన్నారు. అలాగే వివిధ దేశాలలో ఉండే తమ ఉద్యోగులు, ఈ దేశాలలో ఉండే తమవారి కోసం ఆందోళనగా ఉన్నారని, వారికి అవసరమైన సాయం చేస్తామని పేర్కొన్నారు. గూగుల్ కంపెనీ నుండి సుందర్ పిచాయ్ కూడా ఇదే రకమైన సందేశాన్నే షేర్ చేశారు. ఇజ్రాయెల్పై హమాస్ దాడి క్రూరమన్నారు. తమ కంపెనీ ఉద్యోగులు రెండువేల మంది ఉన్నారని, వారి పరిస్థితి ఎలా ఉందో అంటూ ఆందోళన చెందారు. స్థానికంగా ఉన్న ఉద్యోగులతో క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు తీసుకుంటామన్నారు.