మరో రూ. 1000 కోట్లు అప్పు చేసిన ఏపీ సర్కారు
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ నుంచి మరో రూ.1,000 కోట్ల అప్పు తీసుకుంది. రిజర్వు బ్యాంకులో సెక్యూరిటీల వేలంలో పాల్గొని 7.58 శాతం వడ్డీకి ఈ అప్పు తీసుకుంది. ఇందులో 18 సంవత్సరాల కాలపరిమితితో రూ.500 కోట్లు, 20 సంవత్సరాల కాలపరిమితితో మరో రూ.500 కోట్లు చోప్పున సెక్యూరిటీలను వేలం వేసి బహిరంగ మార్కెట్ ద్వారా ఈ రుణం పొందింది.

దీంతో ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఏపీ రాష్ట్రప్రభుత్వం చేసిన అప్పు రూ.48,100 కోట్లకు చేరింది. ఈ 5 నెలల్లో ఆర్బీఐ నుంచి రూ.37,890 కోట్లు తీసుకురాగా.. కేంద్రం నుంచి ఈఏపీ కింద రూ.1,680 కోట్లు, నాబార్డు నుంచి రూ.390 కోట్లు, జూన్లో బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ఎన్సీడీలు జారీ చేసి రూ.8,300 కోట్ల అప్పులు తెచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 44,574 కోట్ల అప్పులకు మాత్రమే కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో పాటు సీపీఎస్ను కొనసాగిస్తే అదనంగా ఇంకో రూ.4,203 కోట్లు తెచ్చుకునే అవకాశాన్ని కల్పించింది. దానిని కూడా పరిగణనలోకి తీసుకుంటే అప్పుల పరిమితి రూ.48,777 కోట్లకు చేరుతుంది. ఇంకా సీపీఎస్ రద్దు చేయలేదు కాబట్టి ఈ అప్పుల పరిమితినే పరిగణనలోకి తీసుకుంటే ఇంకా రాష్ట్రానికి రూ. 677 కోట్లు మాత్రమే అప్పులు తీసుకునేందుకు వెసులుబాటు ఉంది.


 
							 
							