ఉక్రెయిన్ లో అడుగుపెట్టిన ప్రధాని
భారత ప్రధాని మోదీ ఉక్రెయిన్ చేరుకున్నారు. కీవ్ లోని భారత దేశానికి చెందిన ప్రజలు మోదీకి త్రివర్ణ పతాకాలతో ఘన స్వాగతం పలికారు. ఒక్కరోజు పర్యటనలో భాగంగా మోదీ ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీతో భేటీ కానున్నారు. గత రెండు సంవత్సరాలకు పైగా రష్యా, ఉక్రెయిన్ మధ్య వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జెలెన్ స్కీతో భేటీ ఆసక్తికరంగా మారింది. దాదాపు 7 గంటలపాటు ఈ పర్యటన కొనసాగనుంది. 1991లో ఉక్రెయిన్ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత ప్రధాని ఉక్రెయిన్ కు వెళ్లడం ఇదే తొలిసారి.
భారత్ ఏ పక్షం వహించదని.. కేవలం శాంతికి మాత్రం వారధిగా పని చేస్తుందనే సందేశం ఇచ్చేందుకు ప్రధాని ఈ పర్యటనను చేపట్టారు. ఆయన పర్యటనలోని కార్యక్రమాల వివరాలు భద్రతా కారణాల వల్ల గోప్యంగా ఉంచారు. రష్యా దాడిలో మరణించిన చిన్నారులకు ఆయన నివాళి అర్పించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఉక్రెయిన్ నేషనల్ మ్యూజియంను కూడా ప్రధాని సందర్శించనున్నారు.
పొలాండ్ నుంచి ఉక్రెయిన్ ‘ట్రైన్ ఫోర్స్ వన్’ అనే విలాసవంతమైన రైలులో మోదీ బయలుదేరారు. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ లో ఎయిర్ పోర్టులకు భద్రత కరువైంది. రోడ్డు మార్గాలు దెబ్బతిన్నాయి. దీంతో మోదీ రైల్లో పది గంటలు ప్రయాణించి కీవ్ కు చేరుకున్నారు.

