Home Page SliderTelangana

కేసీఆర్ తీరుతోనే తెలంగాణకు అన్యాయం, రాజీవ్ ఎలివేటెడ్ కారిడార్ ఆలస్యం ఆయన వల్లేనన్న రేవంత్

రాజీవ్ రహదారి ఎలివేటేడ్ కారిడార్ పూర్తయితే మేడ్చల్, కుత్బుల్లాపూర్, కరీంనగర్, ఆదిలాబాద్ ప్రయాణం సులభతరం కానుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సికింద్రాబాద్ అల్వాల్ టిమ్స్ సమీపంలో రాజీవ్ రహదారి (SH01) ఎలివేటెడ్ కారిడార్‌కు సీఎం శంకుస్థాపన చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణతో ఈ ప్రాజెక్టు ఆలస్యమైందన్నారు. ప్రజల అవసరాన్ని మర్చిపోయి గత ప్రభుత్వం కేంద్రంతో గిల్లికజ్జాలు పెట్టుకుని ప్రాజెక్టును పక్కన బెట్టిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కేంద్రంతో మాట్లాడి సమస్యను పరిష్కరించామన్నారు. ప్రధాని మోదీని, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్‌ను కలిసి ప్రాజెక్టు అవసరాన్ని వివరించామన్నారు. భూముల కేటాయింపు, చాంద్రాయణగుట్ట రక్షణ శాఖ భూముల లీజ్ రెన్యూవల్ చేయకుండా గత ప్రభుత్వం జాప్యం చేసిందన్నారు. అధికారంలోకి రాగానే తక్షణమే అధికారులతో సమీక్షించి రక్షణ శాఖకు భూములు అప్పగించామన్నారు. ఎలివేటేడ్ కారిడార్ పూర్తయితే మేడ్చల్ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడంతో కేంద్రం రాష్ట్రానికి సహకరించిందన్నారు.

పదేళ్ల బీఆర్ఎస్ దిక్కుమాలిన విధానాలతో ప్రజలకు శిక్ష పడిందన్నారు. ఉత్తర తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ఎలివేటేడ్ కారిడార్ పూర్తవ్వాలన్నారు. ప్రజల అవసరాల కోసమే ఒక మెట్టు దిగా.. రాజకీయాల కోసం కాదన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్‌లో ఏదైనా ఒక శాశ్వత అభివృద్ధి చేశారా అని రేవంత్ ప్రశ్నించారు. ఈ నగరంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది కాంగ్రెస్ పాలనలోనన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో గంజాయి, డ్రగ్స్, పబ్బులు తజప్ప ఏం రాలేదన్నారు. ఈ ఎలివేటేడ్ కారిడార్ ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ముఖద్వారమన్నారు. అభివృద్ధి కోసం భవిష్యత్ లోనూ కేంద్రాన్ని అడుగుతూనే ఉంటామన్నారు. కేంద్రం సహకరించకపోతే కొట్లాడుతామన్నారు.

హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు… ఎన్నికలు ముగిశాక అభివృద్ధి మా లక్ష్యమని చెప్పారు. రాబోయే రోజుల్లో కంటోన్మెంట్ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తామన్నారు. మా పోరాటం ఫలించిందని కేటీఆర్ అంటుండు.. ఏం పోరాటం చేసిండు.. ట్విట్టర్ లో పోస్టులు పెట్టుడా? అన్నారు. మేం అనుమతులు తీసుకొస్తే ఆయన పోరాటం అని చెప్పుకుంటుండని చెప్పారు. ఈ వేదికగా కేటీఆర్ కు నేను సూచన చేస్తున్నా… హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ఇందిరా పార్కు వద్ద కేటీఆర్ ఆమరణ దీక్ష చేయాలన్నారు. కేటీఆర్ చచ్చుడో అభివృద్ధికి నిధులు వచ్చుడో తేలే వరకు దీక్ష చేయాలన్నారు. ఆయన దీక్షకు దిగితే మా కార్యకకర్తలే ఆయన్ను కంచె వేసి కాపాడుతారన్నారు.