పరీక్ష కోసం సదస్సుకు ఆలస్యమైన మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరుగుతున్న ఇన్వెస్టర్స్ సమ్మిట్లో సోమవారం పాల్గొన్నారు. ఈ సదస్సుకు లేటుగా వచ్చిన ఆయన క్షమాపణలు చెప్పారు. తాను ఆలస్యంగా రావడానికి గల కారణాలను వివరించారు. ‘సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షకు ముందే తాను రాజ్భవన్ నుండి బయలుదేరితే భద్రతా కారణాల వల్ల విద్యార్థులకు ట్రాఫిక్ జామ్ కావొచ్చు. వారికి పరీక్షకు ఆలస్యం అవుతుంది. అందుకే పరీక్ష మొదలు అయ్యాక నేను రాజ్ భవన్ నుండి బయల్దేరాను’.. అంటూ వివరించారు. దీనితో అక్కడ పాల్గొన్న వివిధ దేశాల పారిశ్రామిక వేత్తలు ఆయనను అభినందించారు. దాదాపు 60 దేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు, దౌత్యవేత్తలు, భారత వ్యాపార రంగ ప్రముఖులు ఉన్నారు. 20 ఏళ్ల ముందు భారత్కు అంతగా విదేశీ పెట్టుబడులు వచ్చేవి కావని, కానీ పెట్టుబడుల వరసలో భారత్ ముందువరుసలో ఉందని ప్రధాని పేర్కొన్నారు. అలాగే వ్యవసాయం, ఖనిజాల పరంగా, జనాభా పరంగా మధ్యప్రదేశ్ ముందంజలో ఉందని, బీజేపీ నేతృత్వంలోని ఈ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.

