తల నరుక్కుంటాను కానీ వాళ్ల ముందు తల వంచను – సిసోడియా
నూతన మద్యం విధానంలో అవకతవకలపై కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణను ఎదుర్కొంటోన్న ఢీల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఓ కీలక ప్రకటన చేశారు. బీజేపీ నుంచి తనకు ఓ సందేశం వచ్చిందని.. తనపై ఉన్న కేసుల్ని మూసివేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీని వదిలి బీజేపీలో చేరాలని కోరుతూ ఆ సందేశం పంపారని సిసోడియా వెల్లడించారు..

‘నాకు బీజేపీ నుంచి ఒక సందేశం వచ్చింది. CBI, ED నమోదుచేసిన కేసుల్ని మూసివేసేందుకు.. ఆమ్ ఆద్మీ పార్టీని వీడి, బీజేపీ లో చేరాలని అందులో కోరారు. కానీ నేనొక రాజ్పుత్ను… మహా రాణాప్రతాప్ వారసుడిని. నేను నా తలనైనా నరుక్కుంటాను కానీ, అవినీతి కుట్రదారుల ముందు మాత్రం తలవంచను. నాపై పెట్టినవన్నీ తప్పుడు కేసులే. మీరు ఏం చేయాలనుకుంటే అది చేసుకోండి. నాకొచ్చిన సందేశానికి ఇదే నా సమాధానం’ అంటూ మనీశ్ సిసోడియా ఆ ట్వీట్లో పేర్కొన్నారు.
ఢీల్లీలో గతేడాది నవంబరులో కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన అబ్కారీ విధానంలో అనేక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. మద్యం విధానంలో నిబంధనల ఉల్లంఘన జరగడంతో పాటు విధానపరమైన లోపాలున్నట్లు ఢీల్లీ ప్రధాన కార్యదర్శి నరేష్ కుమార్ నివేదిక ఇచ్చారు. టెండర్ల విధానంలో కొందరికి లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. దీంతో ఈ ఉల్లంఘనలపై దర్యాప్తు చేపట్టాలని ఢీల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా.. కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)కు సిఫార్సు చేశారు. దాంతో మనీశ్, పలువురు మాజీ అధికారుల ఇళ్లు, ప్రాంగణాలపై CBI అధికారులు సోదాలు నిర్వహించారు.
అలాగే దర్యాప్తు సంస్థ తనపై లుకౌట్ సర్క్యులర్ (LOC) జారీ చేసిందని సిసోడియా తెలిపారు. తాను దేశం విడిచి వెళ్లకుండా చూడడానికి ఈ నోటీసులు ఇచ్చిందని వెల్లడించారు. అయితే మద్యం కుంభకోణంలో ఎఫ్ఐఆర్లో పేర్లున్న ఎనిమిది మందిపై LOC జారీ చేసినట్లు సీబీఐ తెలిపింది. సిసోదియా సహా నలుగురు ప్రజా ప్రతినిధులపై మాత్రం ఇవి జారీ కాలేదని స్పష్టంచేసింది

