ఈవీఎంల జోలికొస్తే ఊరుకోను!
దక్షిణ కోల్కతాలోని భవానీపుర్ నియోజకవర్గ ఈవీఎంలను భద్రపరిచిన సఖావత్ మెమోరియల్ స్కూల్ స్ట్రాంగ్ రూమ్ను మమత శుక్రవారం సందర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఎవరైనా ఈవీఎంలను దొంగిలించడానికి లేదా ఫలితాలను మార్చేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదన్నారు.
ఎన్నికల సంఘం, భారతీయ జనతా పార్టీ కుమ్మక్కయ్యాయని టీఎంసీ నేతలు ఆరోపిస్తున్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు లేకుండానే బ్యాలెట్ బాక్సులను తెరుస్తున్నారని పేర్కొంటూ దానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను ‘ఎక్స్’ వేదికగా విడుదల చేశారు. బెంగాల్ ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ఒక పెద్ద కుట్ర జరుగుతోందని తృణమూల్ కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఈ ఆరోపణలను భాజపా నేత తాపస్ రాయ్ తోసిపుచ్చారు. ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలియడంతోనే మమతా బెనర్జీ ఇలాంటి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

