ఇది ట్రైలర్ మాత్రమే.. ఈ ఏడాదిలోనే అసలైన సినిమా చూపిస్తాం..
తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర సర్కార్పై మరోసారి ధ్వజమెత్తారు. సెస్ ఎన్నికల్లో చూపించింది ట్రైలర్ మాత్రమేనని, బీజేపీకి ఈ ఏడాదిలోనే అసలైన సినిమా చూపిస్తామన్నారు. మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లాలో మంగళవారం పర్యటించారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం తంగళ్లపల్లి మండల పరిషత్ నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం సెస్ పాలకవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. రైతు కృతజ్ఞత సభలో మాట్లాడారు. కేంద్రం నిధులపై తన సవాల్కు కట్టుబడి ఉన్నానన్నారు. కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్రమే పోషిస్తోందన్నారు. 8 ఏళ్లలో కేంద్రానికి 3 లక్షల 68 వేల కోట్లు ఇచ్చామని.. తిరిగి తెలంగాణకు ఇచ్చింది లక్షా 68వేల కోట్లు మాత్రమేనని కేటీఆర్ అన్నారు. మిగతా 2 లక్షల కోట్లు ఏమైపోయాయని ప్రశ్నించారు. ఇది తప్పయితే రాజీనామా చేస్తాను.. లేదంటే మీరు రాజీనామా చేస్తారా? అంటూ మరోసారి సవాల్ విసిరారు. సెస్లో గెలవని వాళ్లు, రాష్ట్రంలో గెలుస్తారా అంటూ బీజేపీ నాయకులపై విమర్శలు చేశారు. కరీంనగర్కు ఎంపీగా బండి సంజయ్ ఏం చేశారో చెప్పాలని మంత్రి నిలదీశారు.