నేషనల్ బాక్సింగ్లో స్వర్ణం కొల్లగొట్టిన హుస్సాముద్దీన్
తెలంగాణ స్టార్ బాక్సర్ మహ్మద్ హుస్సాముద్దీన్ మరోసారి నేషనల్ బాక్సింగ్ చాంపియన్ షిప్లో బంగారు పతకం సొంతం చేసుకున్నాడు. పురుషుల 57 కిలోల విభాగంలో అతను నేషనల్ చాంపియన్గా అదరగొట్టాడు. సర్వీసెస్ తరఫున పోటీ పడ్డ హుస్సామ్ తుదిపోరులో 4-1తో 2016 ప్రపంచ యూత్ చాంపియన్ సచిన్ (రైల్వేస్)ను చిత్తు చేశాడు. ఇదే టోర్నీలో గతేడాది రజతంతో సరిపెట్టిన తెలంగాణ బాక్సర్ ఈ సారి స్వర్ణంతోనే తిరిగొచ్చాడు. భారత మరో స్టార్ బాక్సర్ అస్సాంకు చెందిన శివ థాపా కూడా బంగారు పతకం గెలిచాడు. 63.5 కిలోల విభాగంలో బరిలోకి దిగిన థాపా ఫైనల్లో 5-0తో అంకిత్ నర్వాల్ (రైల్వేస్)ను చిత్తు చేశాడు. ఈ టోర్నీలో హుస్సాముద్దీన్ ప్రాతినిధ్యం వహించిన సర్వీసెస్ జట్టు… టీం చాంపియన్ షిప్ సొంతం చేసుకుంది. ఆ జట్టుకు చెందిన బాక్సర్లు 6 స్వర్ణాలు సహా 10 పతకాలు గెలిచారు.

