InternationalNews

టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌, రిజ్వర్‌ డేకు వర్షం ముప్పు

ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచ కప్‌ టోర్నీలో ఎవరూ ఊహించని విధంగా పాకిస్తాన్‌ ఫైనల్స్‌కు చేరుకుంది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో పాకిస్తాన్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. రెండో సెమీస్‌లో భారత్‌ను చిత్తుగా ఓడించిన ఇంగ్లాండ్‌.. నవంబర్‌ 13న ఫైనల్‌లో పాక్‌తో తలపడనుంది.

అయితే.. నవంబర్‌ 13న మెల్‌ బోర్న్‌ సిటీ అంతా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు మెల్‌బోర్న్‌ మెటరాలజీ బ్యూరో వెల్లడించింది.  రిజర్వ్‌ డే రోజునా భారీ వర్షం పడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆది, సోమ వారాల్లో మెల్‌బోర్న్‌ సిటీలో 95 శాతం భారీ వర్షం పడే అవకాశాలు ఉన్నాయని అక్కడి వాతావరణ శాఖ అంచనా వేసింది. అదే జరిగితే ఈ ట్రోఫీని ఇంగ్లాండ్‌, పాకిస్తాన్‌ పంచుకోనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.  టోర్నమెంట్‌ నిబంధన ప్రకారం…  ఒక వేళ ఫైనల్‌ మ్యాచ్‌ను వర్షం కారణంగా రిజర్వ్‌ డే రోజు కూడా నిర్వహించలేకపోతే అప్పుడు ఇరు జట్లను సంయుక్త విజేతగా డిక్లేర్‌ చేస్తారు.

2019 వన్డే ప్రపంచకప్‌ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించడంతో.. భారత్‌, న్యూజిలాండ్‌ మ్యాచ్‌ రెండు రోజులు జరిగింది. ఇక 2002లో భారత్‌, శ్రీలంక మధ్య ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌ సమయంలోనూ ఇలాగే జరిగింది. అప్పటి నిబంధనల ప్రకారం.. రిజర్వ్‌ డే రోజున వర్షం అడ్డంకిగా మారడంతో ఇరు జట్లు టైటిల్‌ను పంచుకున్నాయి.