అకాల వర్షాల బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వానికి ఈటల విజ్ఞప్తి
వరదలపై అసెంబ్లీలో జరుగుతున్న చర్చలో విలువైన సూచనలు అందించారు బీజేపీ కీలక నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. భూగర్భజలాలు పెరగడం కోసం చెక్ డామ్ లు కట్టుకున్నామన్న ఈటల, ఒక్కో దగ్గర 6 నుంచి 7 ఫీట్లు ఎత్తులో కట్టడంతో వాటి దగ్గర ఇసుక పేరుకుపోతోందన్నారు. దీంతో వరదవచ్చినప్పుడు చుట్టూ ఉన్న పొలాలు మునిగిపోతున్నాయని… అవి కట్టేప్పుడు ఇబ్బందులు ఊహించలేకపోయామన్నారు. ఇపుడు అర్థం అయ్యింది కాబట్టి వాటిని సరి చేసే పనులు చేపట్టాలని కోరుతున్నామని ప్రభుత్వానికి ఈటల సూచించారు.
వరద వల్ల పశువులు కొట్టుకుపోయి చనిపోయాయని, ఒక్కో గేదె లక్ష రూపాయల విలువ కూడా చేస్తోందని… పశువులు కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లించాలని ఈటల డిమాండ్ చేశారు. ఇళ్ళు కూలిపోయిన వారికి 5 లక్షల రూపాయలు, పాక్షికంగా ఇళ్ళు దెబ్బతిన్న వారికి నష్టపరిహారం చెల్లించి ఆసరాగా ఉండాలని ప్రభుత్వాన్ని కోరారు. వరదవల్ల షాపులు కూడా నష్టపోయాయన్న ఈటల, కట్టబట్టలతో రోడ్డుమీద ఉన్నారని… వారు రోడ్డున పడకుండా… నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఇసుక మేట వేసిన, కోతకు గురి అయిన పొలాలను బాగుచేసుకోవడనికి ప్రభుత్వమే డబ్బులు కేటాయించాలని కోరారు. పాజిటివ్ గా ఆలోచన చేసి నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.

