కేసీఆర్కు కౌంట్ డౌన్ స్టార్టయ్యిందన్న అమిత్ షా
తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వానికి కౌంట్డౌన్ ప్రారంభమైందని, ప్రస్తుత పాలనను గద్దె దించే వరకు బీజేపీ పోరాటం ఆగదని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. చేవెళ్లలో “విజయ్ సంకల్ప సభ” పేరుతో జరిగిన బహిరంగ సభలో షా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే, ముస్లింలకు రిజర్వేషన్లు తొలగిస్తామని అన్నారు. ఈ ఏడాది చివర్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రధానంగా దృష్టిసారించినట్టుగా కన్పిస్తోంది. తెలంగాణలో గత ఎనిమిది-తొమ్మిదేళ్లుగా అవినీతి ప్రభుత్వాన్ని నడుపుతున్న బిఆర్ఎస్కు కౌంట్డౌన్ ప్రారంభమైందని షా అన్నారు.
భారత్ రాష్ట్ర సమితి, కేసీఆర్పై ప్రజల ఆగ్రహాన్ని ప్రపంచం మొత్తం చూస్తోందని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని, అవినీతిపరులను కటకటాల వెనక్కి నెట్టడం ఖాయమన్నారు. “తెలంగాణ ప్రజలు కేసీఆర్, కుటుంబ అవినీతి గురించి తెలుసుకున్నారు. దృష్టిని మరల్చడానికి వారు టీఆర్ఎస్ను బీఆర్ఎస్ వైపు మళ్లించారు” అని అమిత్ షా ధ్వజమెత్తారు. తెలంగాణలో పోలీసింగ్, పరిపాలన పూర్తిగా రాజకీయం అయ్యాయని, ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేపడుతున్న సంక్షేమ పథకాలు అట్టడుగు స్థాయికి చేరడం లేదని ఆరోపించారు.
10వ తరగతి బోర్డు పరీక్ష ప్రశ్నాపత్రం ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్లో రావడంతో అక్రమ కేసులో ఇటీవల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, లోక్సభ ఎంపీ బండి సంజయ్కుమార్ను అరెస్టు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, పార్టీ కార్యకర్తలు అలాంటి వారికి భయపడబోరని అన్నారు. “బిజెపి పార్టీ కార్యకర్తలను కటకటాల వెనక్కి నెడితే భయపడతారని కేసీఆర్ భావిస్తున్నాడు. కేసీఆర్ వినండి, మా కార్యకర్తలు మీ దౌర్జన్యాలకు భయపడరు. మిమ్మల్ని గద్దె దించే వరకు మా పోరాటం ఆగదు” అని షా తేల్చి చెప్పారు.