హెల్మెట్ కొందామని ఆగితే.. మృత్యు ఒడిలోకి వెళ్లిన ప్రాణం
హెల్మెట్ కొందామని బైక్ ను రోడ్డుపై ఆపగా, వెనక నుంచి కారు ఢీ కొట్టడంతో మహిళ మృతి చెందింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం దేవతపల్లికి చెందిన పొల్లెపాక సాయిలు తన భార్య రాములమ్మ, కొడుకుతో కలిసి బైక్ పై హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి బయలుదేరారు. ఇబ్రహీంపట్నం మండలం మంగలపల్లి గేట్ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న దుకాణంలో హెల్మెట్ కొందామని ఆగారు. ఈ క్రమంలో వారిని వెనక నుంచి కారు ఢీ కొనడంతో రాములమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. మిగిలిన ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో సమీప ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ ను ఇబ్రహీంపట్నానికి చెందిన ప్రభుత్వ టీచర్ శంకర్ గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

