Home Page SliderTelangana

వంద ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి

తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరువలేనిదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సకల జనుల సమ్మెలో రాష్ట్ర వ్యాప్తంగా రవాణాను స్తంభింపజేసి రాష్ట్ర సాధన పోరాటానికి సహకరించారన్నారు. తెలంగాణ వస్తే దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయని కార్మికులు భావించారన్నారు. కానీ 90రోజులు సమ్మె చేసినా ఆనాటి ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించలేదని చెప్పారు. 36 మంది కార్మికులు మరణించినా వారి కుటుంబాల గురించి ఆనాటి ప్రభుత్వం ఆలోచించలేదన్నారు రేవంత్. త్మహత్య చేసుకున్నా మీ కార్మిక సంఘాలు రద్దు చేశారు తప్ప మీ సమస్యలు పరిష్కరించలేదన్నారు.

ఈ ప్రజా ప్రభుత్వం ఏర్పడటంలో ఆర్టీసీ కార్మికులు ముఖ్య పాత్ర పోషించారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆరు గ్యారంటీలలో మొట్టమొదటి హామీని అమలు చేసిన ఘనత ఆర్టీసీ కార్మికులదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మొట్టమొదటి బడ్జెట్ ఇవాళ ప్రవేశ పెట్టామన్నారు. రూ.2,75,891 కోట్ల వాస్తవిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టామన్నారు. వాస్తవాల ప్రాతిపదికన బడ్జెట్ ను రూపొందించామన్నారు. గత ప్రభుత్వంలా కాగితాల్లో చూపించి అబద్దాలు చెప్పదలచుకోలేదన్నారు. రాష్ట్ర ప్రజలు వాస్తవిక బడ్జెట్ ను అర్ధం చేసుకోవాలన్నారు. ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా ఆర్టీసీకి రూ.281 కోట్ల నిధులను విడుదల చేస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పథకం ఆర్టీసీ బలోపేతానికి ఉపయోగపడిందన్నారు. మీ ఆశీర్వాదం వల్లే ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు మీ ఆశీర్వాదం ఉండాలన్నారు. దేశంలోనే తెలంగాణ మోడల్ పాలనపై చర్చ జరిగేలా పరిపాలన అందిస్తామన్నారు.

ఆర్టీసీ బలోపేతానికి ఇందిరమ్మ రాజ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కంకణ బద్దలై పనిచేస్తుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క . ఆర్టీసీ మనది. తెలంగాణ ప్రజలందరిదన్నారు భట్టి. ఆర్టీసీకి గత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకుండా నాన్చుడు ధోరణి అవలంబించడం వల్ల ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్ళిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ లాభాల బాటలోకి వెళ్తుందన్నారు. మహాలక్ష్మి పథకాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆర్టీసీకి కొత్త బస్సులు సమకూర్చాలని వచ్చిన ఆలోచన ఫలితంగా నేడు ఆర్టీసీ బలోపేతం అవుతున్నదని చెప్పారు. హైదరాబాద్, నెక్లెస్ రోడ్, అంబేద్కర్ విగ్రహం వద్ద నూతన ఆర్టీసీ బస్సులను సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి ప్రారంభించిన రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆర్టీసీ సంస్థలో డ్రైవర్లు, కార్మికులు పేద, మధ్యతరగతి వర్గాల వారని… వీరికి సక్రమంగా జీతాలు రావాలంటే ఆర్టీసీ బాగుపడాలన్నారు భట్టి. వీరందరి బాగు కోసం ఆర్టీసీ సంస్థను బాగు చేస్తామని భరోసా ఇచ్చారు. మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించడం వల్ల రాష్ట్రంలో 15 కోట్ల 50 లక్షల మంది మహిళలు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేయగలిగారన్నారు. మహిళలు ప్రయాణం చేసిన జీరో టికెట్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఆర్టీసీకి చెల్లిస్తున్నామన్నారు. గత ప్రభుత్వాల మాదిరిగా ఆర్టీసీపై కాంగ్రెస్ ప్రభుత్వం భారం మోపడం లేదన్నారు.

ఆర్టీసీ బస్సుల్లో 70 శాతం పైగా మహిళలు మిగతా పురుషులు ప్రయాణం చేయడం వల్ల నిండుగా కనిపించడమే కాకుండా ఈ సంస్థకు ఆదాయం సమకూరుతుందన్నారు. 100 బస్సులు నేడు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆర్టీసీలో జరిగిన సమ్మె చారిత్రాత్మకరోజన్నారు. గత దశాబ్ద కాలం పాటు ఆర్టీసీ కార్మికులు వారి హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేశారన్న భట్టి… బిఆర్ఎస్ పాలనల్లో ఆర్టీసీ ఉంటుందా? ఎత్తేస్తారా? జీతాలు వస్తాయా? అనేక ఆందోళనలతో కార్మికులు చేపట్టిన సమ్మెను ఉక్కు పాదంతో గత ప్రభుత్వం అణిచివేసిందన్నారు. ఆర్టీసీ సంస్థలో స్వేచ్ఛను, మాట్లాడే హక్కును హరించడమే కాకుండా కార్మికుల హక్కులను గత ప్రభుత్వం కాలరాసిందన్నారు.