Breaking NewsHome Page Sliderhome page sliderNational

మరాఠా మున్సిపల్ లో బీజేపీ రెప రెప

మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ-షిండే సేన నేతృత్వంలోని మహాయుతి కూటమి చారిత్రక విజయం సాధించింది. ముంబై బీఎంసీలో 116 స్థానాల్లో ఆధిక్యం సంపాదించి 25 ఏళ్ల ఠాక్రేల పాలనకు తెరదించింది. మహారాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 29 కార్పొరేషన్లలో మెజారిటీ స్థానాలను గెలుచుకుని బీజేపీ తన ఆధిపత్యాన్ని చూపింది. రెండు దశాబ్దాల తర్వాత ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేల కలయిక ఓటర్లపై ప్రభావాన్ని చూపలేకపోయారు.

మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి క్లీన్ స్వీప్ చేసింది. ముఖ్యంగా ఆసియాలోనే అత్యంత ధనిక మున్సిపల్ కార్పొరేషన్ అయిన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)పై గత 25 ఏళ్లుగా ఉన్న ఠాక్రేల పట్టును బీజేపీ-షిండే సేన కూటమి బద్దలు కొట్టింది. బీఎంసీ పరిధిలో మొత్తం 227 స్థానాలు ఉండగా , మేయర్ పదవిని దక్కించుకోవడానికి 114 స్థానాలు అవసరం ఉంది. మహాయుతి కూటమి 116 స్ధానాలతో స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించి పీఠాన్ని కైవసం చేసుకుంది.

బీఎంసీలో బీజేపీ 88 సీట్లు సాధించగా , షిండే సేన 28 స్థానాల్లో విజయం సాధించింది. ఇక ఠాక్రే కూటమికి 82 సీట్లు మాత్రమే వచ్చాయి . ఉద్ధవ్ శివసేన 74 స్థానాల్లో, రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన 8 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్ పార్టీ 23 సీట్లలో విజయాన్ని అందుకుంది. శరద్ పవార్ ఎన్సీపీ, అజిత్ పవార్ ఎన్సీపీ, ఎంఐఎం పార్టీలు కలిసి 6 సీట్లను దక్కించుకున్నాయి .

మహారాష్ట్ర వ్యాప్తంగా మహాయుతి హవా ..

ముంబై మాత్రమే కాకుండా మహారాష్ట్రలోని మిగిలిన 28 మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా బీజేపీ కూటమి ఘనవిజయం సాధించింది. రాష్ట్రంలోని 29 కార్పొరేషన్లలోని 2,869 సీట్లలో బీజేపీ కూటమి సుమారు 1,517 పైగా స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శించింది. పూణే మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీజేపీ స్పష్టమైన ఆధిక్యంతో 80 సీట్లును సాధించింది. అజిత్ పవార్, శరద్ పవార్ వర్గాలు కలిసి పోటీ చేసినా ఫలితం లేకపోయింది. నాగపూర్, కొల్హాపూర్, భివాండి ప్రాంతాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కాపాడుకుంది.

మధ్యలో చిన్న విరామం మినహా 1985 నుంచి బీఎంసీపై ఉమ్మడి శివసేన పార్టీ పట్టును కొనసాగిస్తూ వస్తోంది. తాజా ఓటమితో ఠాక్రే కుటుంబానికి రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది. దాదాపు రూ. 74,400 కోట్ల వార్షిక బడ్జెట్ కలిగిన బీఎంసీ ఇప్పుడు బీజేపీ-షిండే శివసేన చేతుల్లోకి వెళ్లనుంది. జనవరి 15వ తేదీన జరిగిన పోలింగ్‌లో 52.94 శాతం ఓటింగ్ నమోదైంది.