యాదాద్రికి అరుదైన గౌరవం
తెలంగాణ తిరుమలగా గుర్తింపు పొందిన ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి ఆలయానికి అరుదైన గౌరవం దక్కింది. యాదాద్రి ఆలయంతో కూడిన పోస్టల్ కవర్ను తపాలా శాఖ రిలీజ్ చేసింది. రాష్ట్రంలో ఈ గుర్తింపు పొందిన తొలి ఆలయం యాదాద్రి కావడం విశేషం.

సోమవారం యాదాద్రి ఆలయాన్ని సందర్శించిన కేంద్ర సహాయ మంత్రి దేవుసిన్హ్ చౌహాన్ భువనగిరి పోస్ట్ ఆఫీసులో యాదాద్రి ఆలయంతో ఉన్న పోస్టల్ కవర్ను రిలీజ్ చేశారు.
ఈ స్పెషల్ కవర్పై యాదాద్రి ఆలయం ఏరియల్ వ్యూతో పాటు ఆలయానికి సంబంధించిన వివరాలతో బ్రోచర్ను కూడా ముద్రించారు. యాదాద్రి ఆలయంపై స్పెషల్ కవర్ను రిలీజ్ చేసే అవకాశం దక్కడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని కేంద్ర సహయ మంత్రి తెలిపారు. యాదాద్రి ఆలయానికి సంబంధించిన ప్రస్తావన వేదాలు, స్కంద పురాణంలో ఉందన్నాడు. యాదాద్రి ఆలయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల పునర్నిర్మించిన సంగతి తెలిసిందే. ఆలయాన్ని పునర్నిర్మించేందుకు రూ.1200 కోట్లు ఖర్చు చేశారు. ఇందుకోసం 39 కిలోల బంగారం, భారీ మొత్తంలో వెండిని ఉపయోగించారు.

ఈ ఆలయాన్ని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పున:ప్రారంభించారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులను ఆలయంలోకి అనుమతిస్తున్నారు. హైదరాబాద్ నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో యాదాద్రి ఆలయం ఉంది. యాదాద్రి పోస్టల్ కవర్, బ్రౌచర్ను తెలంగాణలోని అన్ని ప్రధాన పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉంచుతారు. దీన్ని రూ.45కు కొనుగోలు చేయొచ్చు.

