ఇక తెలంగాణపై దృష్టి పెడతాం
తెలంగాణపై టీడీపీ ఫోకస్ చేస్తోందని.. త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఢిల్లీ టూర్ లో ఉన్న ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీపై పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారన్నారు లోకేష్. టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియాతో చిట్ చాట్ చేస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడిగి కలవాల్సిన అవసరం లేదన్నారు. కవితను టీడీపీలో తీసుకోవడమంటే.. జగన్ని పార్టీలో చేర్చుకోవడమేనంటూ వ్యాఖ్యానించారు. పార్టీకి కార్యకర్తలే గుండెకాయ అని, ఆఫీసంటే అది కార్యకర్తల కార్యాలయమే అన్నారు. సీఎంని కలవాలంటే అపాయింట్మెంట్ అవసరంకానీ.. పార్టీ ఆఫీసుకు ఎవరు ఎప్పుడొచ్చినా ఫిర్యాదులు తీసుకుంటామన్నారు. ఢిల్లీ బీజేపీ ఆఫీసు కన్నా టీడీపీ ఆఫీస్ పెద్దగా ఉందన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ NDA అభ్యర్థికి ఎందుకు ఓటేసిందో వైఎస్ జగన్ నే అడగాలని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు లోకేష్. ఢిల్లీ టూర్లో ఉన్న నారా లోకేష్ ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కారు పనితీరును ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. సంక్షేమ పథకాలను బూత్ స్థాయికి తీసుకెళ్లాలని ప్రధాని సూచించారన్నారు. స్వదేశీ వస్తువులను ప్రమోట్ చేయాలని ప్రధాని చెప్పారన్నారు. 2029 ఎన్నికల్లో కూడా మోదీకే తమ మద్దతు ఉంటుందన్నారు.

