కాంగ్రెస్ పాలనలో పల్లెలు అనాథలు అయ్యాయి
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పల్లెలు అనాథలయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు . ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై ఆయన మండిపడ్డారు. షాద్ నగర్ నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచ్ల ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ , కేసీఆర్ హయాంలో గ్రామాలు ట్రాక్టర్లు, నర్సరీలు, జాతీయ అవార్డులతో కళకళలాడగా, నేడు ట్రాక్టర్లకు డీజిల్ పోయించే దిక్కు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు యూరియా కోసం పడుతున్న ఇబ్బందులను కప్పిపుచ్చడానికే ప్రభుత్వం ‘యూరియా యాప్’ తెచ్చిందని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్, కేసీఆర్ వంటి గొప్ప నాయకులు ఎన్నడూ సర్పంచ్ ఎన్నికల కోసం వీధుల్లోకి రాలేదని, కానీ రేవంత్ రెడ్డి ఓటమి భయంతోనే స్వయంగా జిల్లాల్లో పర్యటిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ఈ ప్రభుత్వం మరో రెండేళ్లు మాత్రమే ఉంటుందని, త్వరలోనే మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావడం ఖాయమని కేటీఆర్ పార్టీ శ్రేణుల్లో ధీమా నింపారు.

