ఆ 540 ఎకరాలు ఉదాసిన్ మఠానిదే..!
కూకట్పల్లి వై జంక్షన్ వద్ద ఉన్న 540 ఎకరాల స్థలంపై పూర్తి హక్కు ఉదాసిన్ మఠానిదేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఉదాసిన్ మఠం, గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ (ఐడీయల్ కెమికల్స్) మధ్య తలెత్తిన వివాదానికి సంబంధించి సుప్రీం కోర్టు ఈ మేరకు కీలక తీర్పు ఇచ్చింది. ఈ స్థలాన్ని 1964 నుంచి 1978 వరకు నాలుగు దఫాలుగా ఐడీఎల్ కెమికల్స్కు ఉదాసిన్ మఠం లీజుకిచ్చింది. బఫర్ జోన్లో ఉన్న ఈ భూమిని ఐడీఎల్ కెమికల్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వినియోగించింది. రూ.15 వేల కోట్ల విలువైన ఈ స్థలం యాజమాన్య హక్కుల కోసం కూడా ఐడీయల్ కెమికల్స్ ప్రయత్నించింది. దీంతో ఉదాసిన్ మఠం 2011 నుంచి న్యాయ పోరాటం చేస్తోంది. ట్రిబ్యునల్ నుంచి సుప్రీం కోర్టు వరకూ ఉదాసిన్ మఠం, దేవాదాయ శాఖ పోరాడుతూనే ఉన్నాయి.


 
							 
							