సుస్థిరమైన అభివృద్ధిలో శాసన వ్యవస్థల పాత్ర ఎంతో గొప్పది..స్పీకర్
లోక్ సభ స్పీకర్ శ్రీ ఓంబిర్లా అధ్యక్షతన పార్లమెంట్ భవనం లోని ప్రధాన కమిటీ హాల్ లో జరుగుతున్న 10వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ( CPA ) ఇండియా రిజీయన్ కాన్ఫరెన్స్ లో పాల్గొంటున్న తెలంగాణ శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. “సుస్థిరమైన అభివృద్ధి అనేది సామాజికంగా, ఆర్ధికంగా, పర్యావరణ పరంగా ప్రస్తుత కాలంతో పాటుగా భవిష్యత్తు తరాలకు కూడా వర్తిస్తుంది. భారతదేశంలోని పార్లమెంట్, రాష్ట్రాల శాసన వ్యవస్థలు సుస్థిరమైన అభివృద్ధి కొరకు ఉద్యేశించిన చట్టాలను రూపొందించడం, అవసరమైన నియమాలను రూపొందించడంతో పాటుగా వాటి అమలును నిత్యం వివిధ స్థాయిలలో పర్యవేక్షిస్తున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా సుస్థిరమైన అభివృద్ధి కోసం ఐక్యరాజ్య సమితి పేదరికం, అసమానత్వం, పర్యావరణ క్షీణత, వాతావరణ మార్పులపై 2015 లో రూపొందించిన నియమాలు మన పార్లమెంట్, రాష్ట్రాల శాసన వ్యవస్థలకు మార్గదర్శకాలుగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం నూతనంగా 2014 లో ఏర్పడింది. అయినా సస్థిరమైన అభివృద్ధిలో చెప్పుకోదగిన మార్పును నమోదు చేస్తుంది. శాసనసభ, శాసనమండలిల సహకారంతో క్షేత్ర స్థాయిలో సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది.

తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 2023 లో అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను విజయవంతంగా అమలు చేస్తుంది. అధికారం లోకి వచ్చిన మొదటి వారం రోజుల లోనే ప్రభుత్వ ఆర్ టీ సి బస్సులలో రాష్ట్రమంతా మహిళలకు ఉచిత ప్రయాణం, రూ. 500 లకే గృహ వినియోగ గ్యాస్ సిలెండర్ పథకాలను అమలు చేసింది. ఈ రెండు పథకాల అమలు రాష్ట్రంలో మహిళా సాధికారతకు తోడ్పడింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుస్థిరాభివృద్ధిలో తీసుకుంటున్న చర్యలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఒక మోడల్ గా ఉంటున్నాయి.
2030 సంవత్సరానికి భారతదేశ సుస్థిరాభివృద్ధి లక్ష్యంలో చట్టసభలు నిర్మాణాత్మక పాత్ర పోషిస్తూ పాలన వ్యవస్థ, కమ్యూనిటీ భాగస్వామ్యంతో క్రియాశీల పాత్ర పోషించాలని అభిప్రాయపడుతున్నాను” అని పేర్కొన్నారు.
ఈకార్యక్రమంలో తెలంగాణ నుండి శాసనమండలి డిప్యూటి చైర్మన్ శ్రీ బండ ప్రకాష్ ముదిరాజ్ గారు, లేజిస్లేటివ్ సెక్రెటరీ డా. వి నరసింహా చార్యులు, జాయంట్ సెక్రెటరీ ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు.


 
							 
							