జాతీయ జెండా ప్రజాస్వామ్యానికి ప్రతీక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వాతంత్ర దినోత్సవ సంబురాలు అట్టహాసంగా జరిగాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. దీనిలో భాగంగా సీఎం జగన్ జాతీయ జెండా ఆవిష్కరించారు. సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సీఎం జగన్మోహన్రెడ్డి ప్రసంగించారు. పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా భారతీయుల గుండె అన్నారు. జాతీయ జెండా మన స్వాతంత్రానికి, అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రతీక. 75 ఏళ్లలో దేశం తిరుగులేని విజయాలు సాధించిందని, ప్రపంచంతో పోటీ పడి మరీ ప్రగతి సాధిస్తోందని సీఎం జగన్ కొనియాడారు. స్మార్ట్ ఫోన్ల వినియోగంలో ప్రపంచంలోనే దేశం రెండో స్థానంలో ఉందన్నారు. ప్రపంచ ఫార్మా రంగంలో టాప్ మూడు దేశాల్లో ఇండియా ఒకటిగా నిలిచిందని ఏపీ సీఎం పేర్కొన్నారు.

గడిచిన మూడేండ్లలో వైసీపీ ప్రభుత్వం అనేక సంస్కరణలు అమలు చేసిందని ఏపీ సీఎం చెప్పారు. ప్రతి నెలా 1వ తారీఖున వాలంటీర్లు గడప వద్దకే వచ్చి పింఛన్లు అందజేస్తున్నామన్నారు. రైతులకు అన్ని విధాలా సహాయం చేసే విధంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. గ్రామాల్లో వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు అందుబాటులోకి తీసుకొచ్చాం. డిజిటల్ గ్రంథాలయాలు.. ప్రతి మండలానికి 2 పీహెచ్సీలు ఏర్పాటు చేశామన్నారు సీఎం. రైతులకు సున్నా వడ్డీకే రుణాలు అందజేస్తున్నామని.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చామన్నారు.

దేశంలో చరిత్రలో లేని విధంగా రాష్ట్రంలో 30 లక్షల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందజేశాం. వివిధ దశలో 21 లక్షల ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయన్నారు సీఎం జగన్. రాష్ట్రంలోని తల్లులకు అండగా నిలుస్తూ అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. గడిచిన మూడేండ్లలో విద్యారంగం మీద చేసిన వ్యయం 53 వేల కోట్లకు పైగా ఉంది. వైద్యం, ఆరోగ్యం కోసం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవలు 95 శాతం అందజేస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. రానున్న కాలంలో ప్రజల సంక్షేమం కొరకు మరెన్నో పథకాలు తీసుకొస్తామని సీఎం తెలిపారు.
