పర్యాటకుల, పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణ… జూపల్లి
లాస్ ఏంజెల్స్లో జరిగిన తెలంగాణ టూరిజం రోడ్ షోలో పాల్గొన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యాటకుల, పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను ఆవిష్కరిస్తాం అని పేర్కొన్నారు. : సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు.. ఘనమైన తెలంగాణ చరిత్ర, సంస్కృతి, వారసత్వం కేంద్రంగా పర్యాటకాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు ప్రపంచస్థాయి మౌలిక వసతుల కల్పనతో ముందుకెళుతున్నట్లు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ఱారావు అన్నారు. పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో పాటు, వారసత్వాన్ని కాపాడుకునేందుకు.. నూతన పర్యాటక విధానాన్ని రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణకు పర్యాటకులను ఆకర్శించడం, పర్యాటకుల, ప్రపంచ పెట్టుబడిదారుల గమ్యస్థానంగా తెలంగాణను ఆవిష్కరించడమే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు.. లాస్ ఎంజెల్స్ లోని డబుల్ ట్రీ హోటల్లో నిర్వహించిన తెలంగాణ టూరిజం రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులు (NRIs), విదేశీ ప్రతినిధులు, పర్యాటకులు, అక్కడి అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
అలాగే పర్యాటకంతో పాటు తెలంగాణలో పెరుగుతున్న పెట్టుబడుల అవకాశాలను ప్రస్తావించారు. హైదరాబాద్ నగరం దేశంలో మినీ ఇండియా గా ప్రసిద్ధి పొందిందని, ఆ నగరం ప్రపంచ స్థాయి ఐటీ, ఆరోగ్య సంరక్షణ, ఫార్మాస్యూటికల్ పరిశ్రమలకు కేంద్ర బిందువుగా ఎదిగిందని పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీ (భవిష్యత్తు నగరం) ప్రాజెక్ట్ గురించి పరిచయం చేస్తూ, ఈ ప్రాజెక్ట్ ద్వారా IT, హెల్త్ కేర్, ఫార్మాస్యూటికల్ పరిశ్రమల్లో అద్భుతమైన పెట్టుబడులు కల్పించుకోవచ్చని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పెట్టుబడిదారుల ఆకర్షణ కేంద్రంగా తీర్చిదిద్దుతుందని తెలిపారు.

