ఆర్టీసీ సిబ్బందిని దూషిస్తే సహించేది లేదు..సజ్జనార్
ఆర్టీసీ సిబ్బంది మహాలక్ష్మి స్కీమ్ అమలులో కీలకపాత్ర పోషిస్తున్నారు. అలాంటి వారిని,సంస్థకు బ్రాండ్ అంబాసిడర్లైనా సిబ్బందిని కొందరు దూషిస్తున్నారని, వారిని ఉపేక్షించేది లేదని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హెచ్చరించారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో పోస్టు చేశారు. ఆర్టీసీకి సిబ్బంది వెన్నుముక. వారు అనునిత్యం నిబద్దతతో విధులు నిర్వర్తిస్తూ ప్రతి రోజు లక్షలాది ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. సిబ్బంది కృషి వల్లనే సంస్థ మనగలుగుతుంది. మహాలక్ష్మి స్కీమ్ అమలులోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు. సంస్థకు బ్రాండ్ అంబాసిడర్లైనా సిబ్బందిని కొందరు దూషించడం, దాడులు చేయడం సరికాదు. ఇలాంటి ఘటనలకు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం సహించదు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే మా అధికారులు ఈ ఘటనలపై స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్ లు నమోదు చేసి.. విచారణ చేపట్టారు. ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరూ సిబ్బందికి సహకరించి.. క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సహకరించాలని కోరుతున్నాం. అని పేర్కొన్నారు. ఈ పోస్టుతో పాటు ఆర్టీసీ డ్రైవర్పై ఆటో డ్రైవర్ల దాడి, మహిళా కండక్టర్ను దూషించిన మహిళలు అని ఉన్న న్యూస్ పేపర్ కటింగ్స్ను జతపరిచారు.

