కొద్ది రోజుల్లో నేర చట్టాల బిల్లుకు మోక్షం: అమిత్షా
హైదరాబాద్: వివిధ రకాల వ్యవస్థీకృత నేరాలు సవాళ్లు విసురుతున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్షా అన్నారు. కర్తవ్య నిర్వహణలో అమరవీరుల బలిదానం ప్రేరణ కావాలని చెప్పారు. హైదరాబాద్లోని నేష్నల్ పోలీస్ అకాడమీలో 75వ బ్యాచ్ ఐపీఎస్ల పాసింగ్ ఔట్ పరేడ్ జరిగింది. 175 మంది ట్రైనీ ఐపీఎస్లు శిక్షణ పూర్తిచేసుకోవడంతో ఈ కార్యక్రమం జరిగింది. దీనికి అమిత్షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ట్రైనీ ఐపీఎస్ల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడారు.
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు లభించాయి. కర్తవ్య నిర్వహణలో అమరవీరుల బలిదానం ప్రేరణ కావాలి, వివిధ రకాల వ్యవస్థీకృత నేరాలు సవాళ్లు విసురుతున్నాయి. క్రిప్టో కరెన్సీతో దేశ ఆర్థిక వ్యవస్థ బలహీన పడటానికి దోహదం చేస్తున్నాయి. హవాలా, నకిలీ నోట్ల కట్టడికి మరింత పటిష్ఠంగా పోరాడాలి. ఆంగ్లేయుల కాలం నాటి 3 చట్టాలని మార్చాల్సి ఉంది. సీఆర్పీసీ, ఐపీసీ, ఎవిడెన్స్ చట్టాల్లో మార్పులు చేయాల్సి ఉంది. ఈ మూడు చట్టాల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసి పార్లమెంట్ ముందుంచింది. త్వరలోనే నేరచట్టాల బిల్లు ఆమోదం పొందుతుంది. శాసనాలను సురక్షితంగా ఉంచడమే పాత చట్టాల ఉద్దేశంగా ఉండేది. ప్రజల హక్కులను సురక్షితంగా ఉంచడం కొత్త చట్టాల ఉద్దేశం. కొత్త చట్టాల ఆధారంగా అధికారులు ప్రజలకు రక్షణ కల్పించాలి అని అమిత్షా పిలుపునిచ్చారు. ట్రైనీ ఐపీఎస్ లలో 14 మందిని తెలుగు రాష్ట్రాలకు పరిమితం చేయనున్నారు.

