ఇండోర్ విషాదంపై రాహుల్ గాంధీ నిప్పులు
మధ్యప్రదేశ్ లోని ఇండోర్లో మంచినీరే మృత్యుపాశమై ప్రజల ప్రాణాలు తీసిందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఇండోర్లో కలుషిత నీరు తాగి ప్రజలు మరణించిన ఘటనపై రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు . నగరంలోని తాగునీటి పైపులైన్ల ద్వారా సరఫరా అయింది నీరు కాదని, అది కాలకూట విషమని ఆయన విమర్శించారు. ఈ మరణాలకు బీజేపీ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. నీరు దుర్వాసన వస్తోందని స్థానికులు కొద్దిరోజులుగా ఫిర్యాదు చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం వల్లే తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారని, వంద మందికి పైగా ఆస్పత్రుల పాలయ్యారని ఆయన ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యంపై రాహుల్ మండిపడ్డారు . ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వ నిర్లక్ష్యం పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి పైపుల్లోకి మురుగునీరు చేరడం వల్లే ఈ విషాదం జరిగిందని పోలిసుల ప్రాథమిక విచారణలో తేలింది . జాతీయ మానవ హక్కుల కమిషన్ సైతం ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

