NationalNews

అవినీతి, బంధుప్రీతి దేశాన్ని పట్టిపీడిస్తున్నాయన్న ప్రధాని మోదీ

Share with

ప్రధాని మోదీ రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులర్పించడంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. 75వ స్వాతంత్ర్యదినోత్సవ సంరంభం వేళ దేశ రాజధాని ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 10 వేల మంది భద్రతా సిబ్బందితో అనేక విధాలుగా రక్షణ కల్పించారు. ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ.. మువ్వన్నెల రంగుల జెండా ఎగురేసి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

2047 కోసం ఐదు ప్రతిజ్ఞలు చేద్దామన్నారు. భారతదేశాన్ని అభివృద్ధి చేయడం, దాస్యం శృంఖలాలను తెంచుకోవడం, వారసత్వం పట్ల అంకితభావం, ఐక్యత, బాధ్యతలను నెరవేర్చాలన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన మహాత్మాగాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, బాబాసాహెబ్ అంబేద్కర్, వీర్ సావర్కర్‌లను స్మరించుకున్నారు ప్రధాని మోదీ. 2047 నాటికి స్వాతంత్ర్య సమరయోధుల కలలను నెరవేర్చడానికి ఐదు హామీలతో ముందుకు సాగాలన్నారు.

75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలు మార్చి 2021లో ప్రారంభమయ్యాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ద్వారా స్వాతంత్ర్యస్ఫూర్తిని రగిలిస్తున్నారు. దేశమంతటా, జాతీయ స్మారక చిహ్నాలు మరియు ఐకానిక్ భవనాలు దేదీప్యమానంగా వెలిగాయి.

ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ సిబ్బంది మిషన్ ‘అమృతారోహణ్’గా ఈరోజు ఏకకాలంలో 75 శిఖరాలను అధిరోహించారు. 75 శిఖరాలపై జాతీయ జెండాను ఎగురవేసి రికార్డు సృష్టించారు. ముందుగా మూడు రోజుల పాటు ప్రజలు ఇళ్లలో జెండాను ప్రదర్శించడానికి ప్రభుత్వం అనుమతించింది. “హర్ ఘర్ తిరంగా” ప్రచారం కోసం జెండా చట్టాలను సవరించారు.

దేశంలో మొదటిసారిగా, 21-గన్ సెల్యూట్ వేడుకలో దేశీయంగా తయారు చేయబడిన హోవిట్జర్ తుపాకులు ఉపయోగించారు. డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ DRDO అభివృద్ధి చేసిన అడ్వాన్స్‌డ్ టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ (ATAGS) ప్రధానమంత్రి మోదీ మేక్ ఇన్ ఇండియాకు నిదర్శనంగా నిలిచింది.

దేశ రాజధాని అంతటా విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎర్రకోట ప్రవేశ ద్వారం వద్ద ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ కెమెరాలు అమర్చారు. ఈ కార్యక్రమానికి దాదాపు 7,000 మంది ఆహ్వానితులు హాజరయ్యారు. ఈ సంవత్సరం ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుల హ్యాంగింగ్‌లు, వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి సాంస్కృతిక వారసత్వాన్ని తెలిపేలా ఎర్రకోట గోడలను అలంకరించారు.