NationalNews

పాడం అడవిలో పీఎఫ్‌ఐ పాగా..!

పీఎఫ్‌ఐ శిక్షణా శిబిరంగా కేరళలోని పాడం అడవి

దాడులకు వాడిన వాహనాలు ఇక్కడే ధ్వంసం

అడవి సరిహద్దుల్లో సానుభూతిపరుల నివాసాలు

అటవీ సిబ్బందికి పీఎఫ్‌ఐ సభ్యుల బెదిరింపులు

2021లో కేరళలోని పాడం అటవీ ప్రాంతం నుంచి జిలెటిన్‌ స్టిక్స్‌, వైర్లు మొదలైన పేలుడు పదార్థాలను గుర్తించడంతో ఈ మారుమూల ప్రాంతం వార్తల్లో నిలిచింది. పాడం అటవీ ప్రాంతం ఇప్పుడు ఉగ్రవాద సంస్థ పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ)కు పర్యాయపదంగా మారింది. ఈ సంఘటన సామాజిక సేవా సంస్థ అని చెప్పుకునే పీఎఫ్‌ఐ ఉద్దేశాలపై మరోసారి ప్రశ్నలను లేవనెత్తింది.

మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ ఇక్కడే..

పీఎఫ్‌ఐ సభ్యులు మార్షల్‌ ఆర్ట్స్‌ ప్రాక్టీస్‌ కోసం ఉపయోగించిన 4000 చెక్క కర్రలను ఫిబ్రవరి 15వ తేదీన కేరళ అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇది పీఎఫ్‌ఐ యొక్క యూనిటీ మార్చ్‌కు రెండు రోజుల ముందు జరిగింది. 2013లోనూ కేరళలోని నాంథ్‌లో నిర్వహించిన పీఎఫ్‌ఐ శిక్షణా శిబిరం నుంచి చెక్క కర్రలు, పేలుడు పదార్థాలతో పాటు జిహాదీ సాహిత్యం కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) విచారించింది. కథ ఇంతటితో ముగియలేదు.

పెట్రోల్‌ ట్యాంకులు, బైక్‌ విడిభాగాలు లభ్యం..

పాడం అటవీ ప్రాంతాన్ని పీఎఫ్‌ఐ తరచూ సురక్షిత స్వర్గథామంగా వినియోగిస్తోంది. తమ ప్రత్యర్థులపై దాడి, హత్య లేదా నిఘా సమయంలో హిట్‌ స్క్వాడ్‌ సభ్యులు ఉపయోగించిన వాహనాలను ధ్వంసం చేయడానికి పీఎఫ్‌ఐ పాడం అటవీ ప్రాంతాన్ని వినియోగిస్తోందని నారథ కేసును దర్యాప్తు చేసిన ఒక అధికారి వెల్లడించారు. ఇటీవల పేలుడు పదార్థాలను కనుగొన్న నేపథ్యంలో పాడం అడవిలో మరోసారి సోదాలు నిర్వహించగా పెట్రోల్‌ ట్యాంక్‌లు, ఇంజన్‌ లాంటి బైక్‌ విడిభాగాలు కనుగొనడంతో ఆ దర్యాప్తు అధికారి చెప్పింది నిజమేనని తేలింది.

జింక కళేబరాలు స్వాధీనం..

గత ఆరు నెలల్లోనే పాడం ప్రాంతంలో 15కు పైగా జింక కళేబరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన ఒక దర్యాప్తు అధికారి మాట్లాడుతూ.. ఇది గ్రూప్‌ అటాకింగ్‌లో పట్టు సాధించేందుకు సంబంధించిన పీఎఫ్‌ఐ ప్రమాదరక శిక్షణలో భాగమేనని అభిప్రాయపడ్డారు. బీజేపీ సానుభూతిపరుడు రాహుల్‌ యొక్క రక్తపు ఆనవాళ్లను పాడం మార్గంలో పోలీసులు గుర్తించారు. రాహుల్‌ అదృశ్యం వెనుక పీఎఫ్‌ఐ హస్తం ఉన్నట్లు అనుమానించారు. కథ ఇక్కడితో ముగియలేదు. 2019లో ఆషిక్‌ అనే పీఎఫ్‌ఐ హిట్‌ స్క్వాడ్‌ సభ్యుడు పోలీసులను తప్పించుకునే ప్రయత్నంలో పాడం అటవీ ప్రాంతంలో స్థానికులు వేసిన అక్రమ కంచెతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఈ సంఘటనలన్నీ పాడం అటవీ ప్రాంతం పీఎఫ్‌ఐ అక్రమ కార్యకలాపాలకు సురక్షిత స్వర్గధామంగా మారిందని స్పష్టం చేస్తున్నాయి.

సరిహద్దుల్లో కార్యకర్తల కుటుంబాలు..

పాడం అటవీ ప్రాంతంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన అటవీ సిబ్బందిని పీఎఫ్‌ఐ సభ్యులు బెదిరించిన సంఘటనలు గత ఏడాది 10కి పైగా వెలుగులోకి వచ్చాయని ఆ ప్రాంతానికే చెందిన ఓ అధికారి వెల్లడించారు. పోలీసులు, అటవీ అధికారుల కదలికలపై నిఘా ఉంచేందుకు, పీఎఫ్‌ఐ వ్యూహాత్మకంగా తమ కార్యకర్తల కుటుంబాలను అటవీ సరిహద్దుల్లో స్థిరపరిచారు. వీరి విధేయతకు బదులుగా ఆ ఆక్రమిత భూములకు సంబంధించిన హక్కులను వారికి ఇవ్వజూపుతారు. తదనుగుణంగా ఆ ప్రాంతంపై పీఎఫ్‌ఐ పూర్తి ఆధిపత్యం చెలాయిస్తుంది. ఇతర అటవీ ప్రాంతాలకు ఫైర్‌ వాచర్లను 2021 జనవరి మొదటి వారంలోనే కేటాయించగా.. పాడంకు మాత్రం ఫిబ్రవరి 15వ తేదీ వరకూ ఫైర్‌ వాచర్లను కేటాయించకపోవడం వంటి కేరళ అటవీ అధికారుల తీవ్రమైన లోపాలపై ఇంకా సమాధానం లేదు.

ఎన్నికల్లో ఎస్‌డీపీఐ పోటీ..

సోషల్‌ డెమొక్రటిక్‌ పార్ట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌డీపీఐ) తనను తాను పీఎఫ్‌ఐ యొక్క రాజకీయ విభాగంగా చెప్పుకుంటుంది. 2020లో జరిగిన బెంగళూరు పంచాయతీ ఎన్నికల్లో వారు కొన్ని సీట్లు కూడా గెలుచుకున్నారు. కేరళ, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టారు. పీఎఫ్‌ఐకి ఎస్‌డీపీఐ రాజకీయ విభాగం అయితే పీఎఫ్‌ఐ యొక్క ఆయుధాలు, పేలుడు పదార్థాల శిక్షణలో ఎస్‌డీపీఐ పాత్ర ఏమిటి? తదుపరి విచారణ మరిన్ని వాస్తవాలను వెల్లడిస్తుంది. అయితే.. పార్టీలకు ఓటు వేసే ముందు ఓటర్లు పార్టీల రహస్య ఎజెండా గురించి తెలుసుకోవాల్సిన అవసరాన్ని తెలియజేస్తుంది. 9/11 దాడికి ముందు అమెరికా అనేక హెచ్చరిక సంకేతాలను విస్మరించిందని జాన్‌ వికన్స్‌ అనే రిటైర్డ్‌ సీఐఏ ఏజెంట్‌ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. భారత గడ్డపై అదే తప్పు చేయకుండా దక్షిణాది రాష్ట్రమైన కేరళను, యావత్‌ భారత దేశాన్ని విపత్తు నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.