Breaking Newshome page sliderHome Page SliderTelangana

నిన్నటి వరకు ఒక లెక్క, రేపటి నుంచి మరో లెక్క

భారత్ ఫ్యూచర్ సిటీ రేపటి తెలంగాణ ప్రగతికి వేగుచుక్క అని, నిన్నటి వరకు ఒక లెక్క, రేపటి “తెలంగాణ గ్లోబల్ సమ్మిట్” తర్వాత మరో లెక్క అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ‘ప్రజాపాలన’ రెండేళ్ల విజయోత్సవ శుభాకాంక్షలను సీఎం సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. సరిగ్గా రెండేళ్ల క్రితం తమ ఓటుతో గెలుపు సంకల్పాన్ని ఇచ్చి ఆశీర్వదించిన తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ రెండేళ్ల ప్రస్థానంలో తెలంగాణను శిఖరాగ్రాన నిలిపేందుకు అహర్నిశలూ శ్రమించానని పేర్కొన్నారు. ముఖ్యంగా, గత పాలన శిథిలాల కింద ఉన్న నవతరానికి కొలువుల జాతరతో కొత్త ఊపిరి పోశామని, రుణభారంతో వెన్ను విరిగిన రైతుకు దన్నుగా నిలిచి దేశానికే ఆదర్శంగా నిలిపామని తెలిపారు. ఆడబిడ్డల ఆకాంక్షలకు ఆర్థిక మద్దతు ఇచ్చి అదానీ, అంబానీల లెక్క వ్యాపారరంగంలో నిలిపామని, బలహీనవర్గాల వందేళ్ల ఆకాంక్షలను కుల లెక్కలతో కొత్త మలుపులు తిప్పామని, వర్గీకరణతో మాదిగ సోదరుల ఉద్యమానికి సార్థకత చేశామని వివరించారు. చదువొక్కటే బతుకు తెరువుకు బ్రహ్మాస్త్రం అని నమ్మి, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్లు, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీకి శ్రీకారం చుట్టామన్నారు. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమానత్వం మూల సిద్దాంతంగా ముందుకు సాగుతున్నామని, “జయ జయహే తెలంగాణ” అన్న ప్రజాకవి అందెశ్రీ గేయానికి జన ఆకాంక్షల మేరకు అధికారిక గుర్తింపు ఇచ్చామని తెలిపారు. సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆడబిడ్డలకు ఉచిత బస్సు పథకం, రూ.500 కే గ్యాస్, సన్న ధాన్యానికి రూ.500 బోనస్, కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే గొప్ప పథకాలన్నీ ఈ రెండేళ్ల సంక్షేమ చరిత్రకు సాక్ష్యాలు అని ఆయన పేర్కొన్నారు. స్వతంత్ర భారత ప్రయాణం వందేళ్ల మైలురాయికి చేరే సందర్భం 2047 నాటికి తెలంగాణ ఎట్లుండాలనే లోతైన మథనంతో మార్గదర్శక పత్రం సిద్ధం చేశామని, ప్రపంచ వేదికపై #TelanganaRising రీ సౌండ్ చేసేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. తెలంగాణ నాకు తోడుగా ఉన్నంత వరకు.. ఈ గొంతులో ఊపిరి ఉన్నంత వరకు.. తెలంగాణ రైజింగ్ కు తిరుగు లేదని అని తెలుపుతూ అందరికీ విజయోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.