దావూద్ ఆచూకీ చెబితే ..పాతిక లక్షలు
అండర్ వాల్డ్ డాన్ దావూద్ ఇబ్రాహీం ఆచూకీ చెబితే అక్షరాల 25లక్షల రూపాయల రివార్డు ఇస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ NIA ప్రకటించింది. గత కొంత కాలంలో దావూద్ కోసం వేటాడుతున్న NIA మరింత దూకుడుగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే రివార్డులను ప్రకటించింది. దావూద్ ఇబ్రాహీం తాజా ఫోటోలను NIA విడుదల చేసింది. అదేవిధంగా దావూద్ ఇబ్రహీం అనుచరుడు చోటా షకీల్ కు సంబంధించిన సమాచారం ఇస్తే 20లక్షల బహుమతి ఇస్తామని వెల్లడించింది. వీరితో పాటు చాలాకాలంగా తప్పించుకు తిరుగుతున్న అంతర్జాతీయ నేరస్తులు అనీస్ ఇబ్రహిం, జావేద్ చిక్నా, టైగర్ మొమోన్ ఆచూకీ తెలిపితే రూ. 15 లక్షల రివార్డును ఇస్తామని NIA ప్రకటించింది.

దావూద్ ఇబ్రహీం అండర్ వరల్డ్ సిండికేట్ నడుపుతూ మనీలాండరింగ్, నకిలీ కరెన్సీనోట్ల చలామణి చేస్తున్నట్టు గతంలో వెల్లడైంది. దావూద్, అతని అనుచరులు లష్కరేతోయిబా, జైషే మహ్మద్, అల్ ఖైదా ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూరుస్తున్నారని వాటితో కలిసి పనిచేస్తున్నారని ఎన్ఐఎ తెలిపింది. 1993 నాటి ముంబయి పేలుళ్ల సూత్రధారి అయిన దావూద్ ఇబ్రహీం, ఐక్యరాజ్యసమితి గుర్తించిన ఇతర ఉగ్రవాదులు పొరుగు దేశాల్లో దర్జాగా బతుకుతున్నారని గత ఏడాది ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ గళమెత్తింది. ఉగ్రవాద సంస్థల నుండి వచ్చే బెదిరింపులను పరిష్కరించుకునేందుకు అంతర్జాతీయ ప్రయత్నాలపై దృష్టి కేంద్రీకరించాలని భారత్ పిలుపునిచ్చింది.

