Andhra Pradeshhome page sliderHome Page SliderPoliticsviral

ఆమె గొంతును ఎవరూ నొక్కలేరు

హోంమంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత గుడివాడ అమర్ నాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యల దుమారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరింత ముదిరింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ సోషల్ మీడియా వేదికగా అత్యంత తీవ్రంగా స్పందించారు. అమర్ నాథ్ చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం యాదృచ్ఛికంగా చేసినవి కావని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ ఐదేళ్ల విఫల పాలనలో పెంచి పోషించిన విషపూరిత, వికృత రాజకీయ సంస్కృతికి ఇవి ప్రత్యక్ష నిదర్శనమని లోకేశ్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయని, అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని లోకేశ్‌ విమర్శించారు. వీటిపై మాట్లాడటానికి ఆ పార్టీ నేతల వద్ద ఎలాంటి సమాధానాలు లేవని ఆయన ఎద్దేవా చేశారు. అందుకే హోంమంత్రి పదవిలో ఉన్న ఒక మహిళను, అందులోనూ ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన నాయకురాలిని పనిగట్టుకుని లక్ష్యంగా చేసుకున్నారని మండిపడ్డారు. ఈ దాడుల వెనుక వైసీపీ దిగజారుడు రాజకీయం దాగి ఉందన్నారు.

హోంమంత్రి వంగలపూడి అనిత కష్టపడే తత్వానికి, ధైర్యానికి, నిరంతర ప్రజాసేవకు నిదర్శనమని లోకేశ్‌ కొనియాడారు. వైసీపీ నాయకులు ఎంతగా దూషించినా, బాడీ షేమింగ్ చేసినా ఆమె సాధించిన విజయాలను అస్సలు తగ్గించలేరని స్పష్టం చేశారు. ఆమె గొంతును ఎవరూ నొక్కలేరని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇలాంటి ద్వేషపూరిత రాజకీయాలను ఎప్పుడో తిరస్కరించారని ఆయన గుర్తుచేశారు. ఈ ఉదంతంపై హోంమంత్రి అనితతో పాటు రాష్ట్రంలోని ప్రతి మహిళకు, ప్రతి దళితుడికి వైసీపీ నాయకత్వం తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని నారా లోకేశ్‌ గట్టిగా డిమాండ్ చేశారు.