NewsNews AlertTelangana

నా వల్లే మునుగోడుకు నిధులు: రాజగోపాల్‌రెడ్డి

Share with

మునుగోడు అభివృద్ధి కోసం నిధులు విడుదల చేయాలని తాను మూడున్నరేళ్లుగా ఎంతగా కోరినా సీఎం కేసీఆర్‌ స్పందించలేదని ఇటీవల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఇప్పుడు తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. ఉప ఎన్నిక అనివార్యమైన తరుణంలో టీఆర్‌ఎస్‌ నేతలు డబ్బుల సంచులతో మునుగోడు బాట పడుతున్నారని ఎద్దేవా చేశారు. తన త్యాగంతో ఈ నియోజక వర్గంలో వేల కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు టీఆర్‌ఎస్‌ సర్కారు శ్రీకారం చుట్టిందన్నారు.

తాను రాజీనామా చేయడం వల్లే చేనేత కార్మికులకు పింఛను ప్రకటించారని, రోడ్లు వేస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ఇంతకాలం మునుగోడును అభివృద్ధి చేయాలని కోరితే స్పందించని సీఎం కేసీఆర్‌.. ఇప్పుడు ఇక్కడి సర్పంచ్‌లకు ఫోన్లు చేసి `మీ ప్రాంతానికి ఏం కావాలి` అని అడుగుతున్నారని తెలిపారు. మునుగోడు ప్రజలకు, కేసీఆర్‌కు మధ్య జరుగుతున్న యుద్ధమే ఈ ఉప ఎన్నిక అని రాజగోపాల్‌రెడ్డి అభివర్ణించారు.