Andhra PradeshHome Page Slider

అకాల వర్షాల రైతులను ఆదుకోవాలని అధికారులకు జగన్ ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ లో అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు, పంటలపై దాని ప్రభావం అంశంపై అధికారులతో సీఎం సమీక్షించారు. వర్షాల వల్ల రైతుల వద్ద తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. ఈమేరకు పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలపై మొదలైన ఎన్యుమరేషన్‌ను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి… నివేదిక ఖరారు చేయాలన్నారు. ఈనెలలో వైయస్సార్‌ రైతు భరోసాతోపాటు.. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునేలా ఇన్‌పుట్‌ సబ్సిడీ జారీకి అన్నిరకాల చర్యలు తీసుకోవాలని చెప్పారు. నష్టపోయిన రైతుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించి సామాజిక తనిఖీ పూర్తిచేయాలన్నారు. మార్చి నెలలో కురిసిన వర్షాలకు సంబంధించి ఇప్పటికే పంట నష్టం అంచనాలు తయారు చేశామని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. ప్రస్తుతం కురుస్తున్న పంట నష్టం అంచనాలపైనా ఎన్యుమరేషన్‌ చురుగ్గా కొనసాగుతోందని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు.