మూడు పెళ్లిళ్లపై మీ వ్యాఖ్యలను తక్షణమే వెనక్కు తీసుకోవాలి…
◆మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి
◆జనసేనాని పవన్ కళ్యాణ్ కు నోటీసు జారీ చేసిన రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ
మూడు పెళ్లిళ్లపై ఇటీవల జనసేన రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కు తీసుకోవాలని, మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ కోరారు. ఈ మేరకు శనివారం మహిళా కమిషన్ జనసేనాని పవన్ కళ్యాణ్ కు నోటీసు జారీ చేసింది. ఇటీవల పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై చేసిన వ్యాఖ్యలు సమాజంలో పెద్ద దుమారాన్ని రేపాయన్నారు. భరణం ఇస్తే భార్యను వదిలించుకోవచ్చు అనే సందేశాన్నిస్తూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలతో మహిళాలోకం షాక్ కు గురైందన్నారు. తన మాటల్లోని తప్పు తెలుసుకుని మహిళా లోకానికి వెంటనే సంజాయిషీ ఇస్తారని మహిళా కమిషన్ ఎదురు చూసిందన్నారు. ఇన్ని రోజులైనా పవన్ కళ్యాణ్ లో పశ్చాత్తాపం తో పాటు మహిళల ఆత్మగౌరవం దెబ్బతీసినందుకు క్షమాణలు కూడా లేవన్నారు. ఎవరి జీవితంలో అయినా మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వస్తే అది ఖచ్చితంగా వ్యతిరేక అంశమేనన్నారు.

కోట్ల రూపాయల భరణంతో విడాకులు ఇచ్చి మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని, చేతనైతే మీరు కూడా చేసుకోండని అత్యంత సాధారణ విషయంగా ఎలా మాట్లాడగలిగారని ప్రశ్నించారు. కోట్లు, లక్షలు, వేలు ఎవరి స్థాయిలో వారు భరణమిచ్చి భార్యను వదిలించుకుంటూ పోతే ఏ మహిళ జీవితానికి భద్రత ఉంటుంది? ఒక సినిమా హీరోగా, ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా మూడు పెళ్లిళ్లపై మీ మాటల ప్రభావం సమాజంపై ఉంటుందని మీకు తెలియదా? అని ప్రశ్నించారు. మిమ్మల్ని ఫాలో అవుతున్న యువత చేతనైతే మూడు పెళ్లిళ్లు చేసుకోవచ్చు అనే అభిప్రాయాన్ని తలకెత్తుకోరా? అని మహిళా కమిషన్ ప్రశ్నించారు. పవన్ ప్రసంగంలో మహిళలను ఉద్దేశించి స్టెప్నీ అనే పదం ఉపయోగించడం తీవ్ర ఆక్షేపణీయమన్నారు. మహిళలను భోగ వస్తువు గా, అంగడి సరుకు గా భావించే వారు ఇటువంటి పదాలను ఉపయోగిస్తారన్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఇప్పటికే అనేకమంది మహిళలు ఫిర్యాదు చేశారని, పవన్ మాటలు అవమానకరంగా మహిళా భద్రతకు పెను ప్రమాదంగా మారతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. మహిళలను కించపరిచే మాటలు మాట్లాడటం, చేతనైతే మీరు మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని పిలుపునివ్వడం పై పవన్ కళ్యాణ్ తక్షణమే క్షమాణలు చెప్పి తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని నోటీస్ జారీ చేసినట్లు రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు.


