జాతీయ జెండాతో స్కూటీని క్లీన్ చేసుకున్నాడు
ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్న వేళ ఓ వ్యక్తి.. త్రివర్ణ పతాకాన్ని అవమానించాడు. జెండాతో ఏకంగా స్కూటీని క్లీన్ చేశాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఈశాన్య ఢిల్లీలోని భజన్పురా ప్రాంతంలో ఉత్తర ఘోండా ప్రాంతంలో నివసించే ఓ వ్యక్తి(52) తన స్కూటీని జాతీయ జెండాతో శుభ్రం చేసుకున్నాడు. త్రివర్ణ పతాకంతో దుమ్ము దులుపుతూ కనిపించాడు. స్థానికులు ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టుచేయడంతో ఈ వీడియో వైరలైంది.
ఇక ఆ వీడియో ఢిల్లీ పోలీసుల దృష్టికి వెళ్లింది. దాంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.ఆ వ్యక్తి ఉపయోగించిన జాతీయ జెండా, స్కూటీని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకున్నాం. 1971లోని సెక్షన్-2 కింద భజన్పురా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.అయితే ఉద్దేశపూర్వకంగా తాను చేయలేదని, పొరపాటున చేశానని నిందితుడు చెప్పినట్టు తెలుస్తుంది.

